logo

బాల భారత రచయితలం.. సమ సమాజ స్థాపకులం

మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు పిల్లల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించాలనే ఆలోచనలతో నగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్తు ‘బాల సాహిత్య సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది.

Updated : 06 Feb 2023 05:02 IST

మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు పిల్లల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందించాలనే ఆలోచనలతో నగరంలోని తెలంగాణ సారస్వత పరిషత్తు ‘బాల సాహిత్య సమ్మేళనానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం జరిగిన సమ్మేళనంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే సాహిత్య రచనలు చేస్తున్న బాలలు, బాల సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో హాజరై సమ సమాజ మార్గనిర్దేశకులమై రచనలు చేస్తామని ‘న్యూస్‌టుడే’తో అన్నారు.

న్యూస్‌టుడే, నారాయణగూడ


నేను 8వ తరగతి చదువుతున్నా.. పాఠశాలలో ఏదైన సాహితీ సంబంధ కార్యక్రమాలు జరిగితే పాల్గొంటుంటా. సైన్స్‌ ఫిక్షన్‌, ఆధునిక అంశాలపై కథలు రాస్తున్నాను. కళ్లముందు అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం, పరిశ్రమల పేరిట పర్యావరణాన్ని ఎలా హరిస్తున్నాం వంటి అంశాలతో కూడా కథలు రాస్తున్నాను. మా తెలుగు ఉపాధ్యాయురాలు నాకు మార్గదర్శనం చేస్తున్నారు.
(ఎ.తరుణ్‌, నిజామాబాద్‌)


మా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో  ఏడాది కాలంగా కథలు రాయడం మొదలుపెట్టా. పాఠశాలలో జరిగిన కథల పోటీలో సైన్స్‌ ఫిక్షన్‌ తరహా కథలు రాశాను. ముఖ్యంగా భవిష్యత్‌ ఎలా ఉండబోతుందో రాయమన్నారు. ఈ కథకు బహుమతి అందుకున్నాను.
(ఎస్‌.మేఘన, కామారెడ్డి జిల్లా,    9వ తరగతి విద్యార్థిని)


నేను ఇంటర్‌ చదువుతున్నా. మణిపూసలు ప్రక్రియలో 8వ తరగతి నుంచి ఇప్పటి వరకు మూడు పుస్తకాలు రాశాను. సెల్‌ఫోన్‌ వచ్చిన తరువాత ఆకాశంలో ఎగిరే పక్షుల సంఖ్య తగ్గిపోయింది. వాటిని ఎలా కాపాడుకోవాలో కవితల్లో చెప్పా.
(బి.నాగరాజు, తాండూర్‌)


పిల్లలతో కవితలు, కథలు రాయిస్తున్నాం. చాలా మంది పిల్లల రచనలు ప్రకృతి, కుటుంబం, తమ చుట్టూ ఉన్న పరిసరాల వరకే పరిమితం అవుతున్నాయి. దాని విస్తృతి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా.
(సి.కిరణ్‌కుమార్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ వనపర్తి)


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల్లోని సృజనకు పదునుపెట్టి రచనలు చేయడానికి ‘రీడ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పిల్లలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి మా దేవునిపల్లి పాఠశాల పేరిట వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, అందులో నాకొచ్చిన ఆలోచనల్ని పోస్టులు పెడుతూ.. కథలు రాయమని చెబుతుంటా.. పిల్లలు చక్కగా స్పందిస్తూ.. వారికున్న ఆలోచనలకు పదునుపెట్టి కథలు రాస్తుంటారు. పిల్లల్లో అద్భుతమైన సృజన ఉంది. వారిని ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారని కచ్చితంగా నమ్ముతున్నా.

(డా.నమిలికొండ సునీత, కామారెడ్డి జిల్లా, దేవునిపల్లి ఉన్నత పాఠశాల, ఉపాధ్యాయురాలు)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని