logo

లంచం డిమాండ్‌ చేసిన బేగంపేట ఎస్సై, కానిస్టేబుల్‌పై కేసు

ఓ కేసులో బాధితుడికి స్టేషన్‌ బెయిల్‌తోపాటు జప్తు చేసిన వాహనాన్ని తిరిగివ్వడానికి రూ.12వేలు లంచం డిమాండ్‌ చేసిన బేగంపేట ఠాణా సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ సాయికుమార్‌, కానిస్టేబుల్‌ నరేష్‌పై అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు కేసు నమోదు చేశారు.

Published : 08 Feb 2023 02:40 IST

సాయికుమార్‌, నరేష్‌

బేగంపేట, న్యూస్‌టుడే: ఓ కేసులో బాధితుడికి స్టేషన్‌ బెయిల్‌తోపాటు జప్తు చేసిన వాహనాన్ని తిరిగివ్వడానికి రూ.12వేలు లంచం డిమాండ్‌ చేసిన బేగంపేట ఠాణా సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ సాయికుమార్‌, కానిస్టేబుల్‌ నరేష్‌పై అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు కేసు నమోదు చేశారు. రాఘవేందర్‌ అనే వ్యక్తికి  స్టేషన్‌ బెయిల్‌, జప్తు చేసిన ద్విచక్ర వాహనాన్ని తిరిగివ్వడం, ఇతరత్రా సాయం కోసం ఎస్సై సాయికుమార్‌ రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. కానిస్టేబుల్‌ నరేశ్‌ తనకు రూ.3వేలు ఇవ్వాల్సి ఉంటుందని మెలిక పెట్టాడు.  బెయిల్‌ ఇప్పించడం కోసం (ఎఫ్‌డీఆర్‌) మరో రూ.5వేలు ఇవ్వాలని చెప్పగా ఆ మొత్తం  చెల్లించాడు. జనవరి 4న బాధితుడి అభ్యర్థన మేరకు లంచం డబ్బును రూ.15వేల నుంచి రూ.12వేలకు తగ్గించాడు. కానిస్టేబుల్‌ నరేశ్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎస్సై చెప్పాడు. అప్పటినుంచి రూ.12వేల కోసం రాఘవేందర్‌ను రోజు వేధిస్తుండటంతో అనిశా అధికారులను ఆశ్రయించారు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో  దాడి చేసి ఎస్సై సాయికుమార్‌, కానిస్టేబుల్‌ నరేష్‌లను పట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నం కొద్దిలో విఫలమైంది. అంతకుముందే బాధితుడు తీసిన వీడియో, ఆడియో ఆధారాలు సమర్పించడంతో అనిశా అధికారులు ఎస్సై, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. పోలీసు స్టేషన్‌లో సాయంత్రం సోదాలు జరిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని