logo

పబ్‌, పెట్స్‌ స్టోర్‌లో సోదాలు..

పబ్‌లో వన్యప్రాణుల్ని ప్రదర్శన వ్యవహారంలో నగర టాస్క్‌ఫోర్స్‌, అటవీ శాఖ అధికారులు జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్‌, సైదాబాద్‌లోని ఎక్సాటిక్‌ పెట్స్‌ స్టోర్‌లో మంగళవారం సోదాలు నిర్వహించాయి.

Published : 31 May 2023 02:43 IST

ఏడుగురిపై కేసు
21 వన్యప్రాణులు స్వాధీనం

వినయ్‌రెడ్డిని అదుపులోకి   తీసుకొన్న అటవీ అధికారి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పబ్‌లో వన్యప్రాణుల్ని ప్రదర్శన వ్యవహారంలో నగర టాస్క్‌ఫోర్స్‌, అటవీ శాఖ అధికారులు జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్‌, సైదాబాద్‌లోని ఎక్సాటిక్‌ పెట్స్‌ స్టోర్‌లో మంగళవారం సోదాలు నిర్వహించాయి. ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 28న ‘జోరా వైల్డ్‌’ పేరుతో పబ్‌ నిర్వాహకులు వైల్డ్‌ జంగిల్‌ పార్టీ ఏర్పాటుచేశారు. కొన్ని వన్యప్రాణులను ఇక్కడికి తీసుకువచ్చి ప్రదర్శనగా ఉంచారు. దీనిపై ‘ఈనాడు’లో ఈనెల 30న ‘పబ్‌లో వన్యప్రాణులు’ పేరుతో కథనం ప్రచురితమైంది. ఇదే విషయంలో ట్విటర్‌లో ఆశిష్‌ చౌదరి అనే ఖాతాదారుడు చేసిన పోస్టుపై ఎంఏఅండ్‌యూడీ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ స్పందించారు. దీనిపై తెలంగాణ డీజీపీ, కమిషనర్‌ దృష్టి సారించాలంటూ రీట్వీట్‌ చేశారు. ఈ క్రమంలో పశ్చిమ మండల అటవీ రేంజ్‌ అధికారి అనురాధ సిబ్బందితో కలిసి జోరా పబ్‌లో సోదాలు నిర్వహించారు. అప్పటికే జూబ్లీహిల్స్‌ పోలీసులు పబ్‌ నిర్వాహకుడు వినయ్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని అటవీ అధికారి అనురాధకు అప్పగించారు. పబ్‌ యజమాని వినయ్‌రెడ్డి, మేనేజర్‌ వరహాలనాయుడు, వన్యప్రాణుల విక్రేత మారేడ్‌పల్లికి చెందిన తరుణ్‌, వంశీ, సైదాబాద్‌లోని హైదరాబాద్‌ ఎక్సోటిక్‌ పెట్స్‌ అనే స్టోర్‌ నిర్వాహకుడు యాసిర్‌ హుస్సేన్‌, కూకట్‌పల్లిలో వన్యప్రాణుల కేంద్రం నిర్వాహకుడు కార్తీక్‌ను అరెస్టుచేశారు. పబ్‌ మేనేజర్‌ పృథ్వీ పరారీలో ఉన్నాడు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖలీల్‌ పాషా, ఎస్సైలు ఎన్‌ రంజిత్‌కుమార్‌, ఎఫ్‌ఆర్‌వో రమేశ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

* సోదాల్లో పెట్స్‌ స్టోర్‌, పబ్బులో కలిపి 14 పర్షియన్‌ పిల్లులు, మూడు బెంగాల్‌ పిల్లులు, రెండు లిజర్డ్‌లు(తొండ), చిలుక, రెండు షుగర్‌ గ్లైడర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని కేబీఆర్‌ ఉద్యానవనంలోని కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని