logo

Sangareddy: చెల్లెలిని ప్రేమిస్తున్నాడని.. యువకుడి దారుణ హత్య!

అందరూ చూస్తుండగా పట్టపగలు ఓ యువకుడు దారుణ హత్యకు గురవడం సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం పీచేర్యాగడితండాలో కలకలం రేపింది.

Updated : 20 Jul 2023 08:24 IST

కోహీర్‌, న్యూస్‌టుడే: అందరూ చూస్తుండగా పట్టపగలు ఓ యువకుడు దారుణ హత్యకు గురవడం సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం పీచేర్యాగడితండాలో కలకలం రేపింది. కోహీర్‌ ఎస్సై సురేశ్‌ కథనం ప్రకారం... పీచేర్యాగడితండాకు చెందిన కేతావత్‌ సుదీప్‌(19) జహీరాబాద్‌ పట్టణంలోని ఓ థియేటర్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా సుదీప్‌ అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(15)తో స్నేహంగా ఉంటున్నాడు. దీనిని గుర్తించిన ఆమె అన్న.. తన చెల్లికి దూరంగా ఉండాలని సుదీప్‌ను హెచ్చరించాడు. అయినా సుదీప్‌ ఆలోచనల్లో మార్పు రాలేదని గుర్తించిన ఆ యువకుడు అతడిని ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం సుదీప్‌  పీచేర్యాగడితండాలోని ఓ కిరాణా దుకాణం వద్ద కూర్చుని ఉన్నాడు. అదే అదనుగా భావించిన ఆ బాలిక అన్న వెంట తెచ్చుకున్న గొడ్డలితో అకస్మాత్తుగా సుదీప్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన సుదీప్‌ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ చివరకు తుదిశ్వాస విడిచాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం జహీరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. సుదీప్‌ తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మరోవైపు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ రఘు, సీఐ రాజు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని