logo

కలెక్టరేట్‌ కేంద్రంగా కీలక విభాగాలు

లోక్‌సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.

Updated : 20 Apr 2024 06:20 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి

లోక్‌సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఎన్నికల ప్రక్రియ అంటే సామాన్యమేమీ కాదు.. రకరకాల కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఓటరు చైతన్యం నుంచి ఓటేసే వరకు, పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని వసతుల కల్పన, ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం, తర్వాత ఓట్ల లెక్కింపు వరకు ఇలా ఎన్నో ఉంటాయి. మరోవైపు అక్రమాలపై దృష్టిసారిస్తారు. వీటన్నింటికి సంబంధించి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసింది. ఒక్కో దానికి ఒక్కో నోడల్‌ అధికారిని నియమించారు. అన్ని విభాగాల బాధ్యత కలెక్టర్‌దే.


మానవ వనరులు: ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిలాల్లో పోలింగ్‌ రోజు ఎవరెవరు ఎక్కడ విధులు నిర్వర్తించాలనేది ఈ విభాగం నిర్ణయిస్తుంది. జిల్లాలో పే స్కేల్‌ను పరిగణనలోకి తీసుకోని వివిధ స్థాయిలో అధికారులను నియమించింది.


చైతన్యం: ఓటు హక్కు వినియోగంపై చైతన్యం తీసుకొచ్చేందుకు ఈ విభాగం పని చేస్తుంది. పోలింగ్‌ తక్కువ నమోదైన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.  ఓటర్లకు ఓటు హక్కు ప్రాధాన్యాన్ని చెబుతారు.


శిక్షణ విభాగం: ఎన్నికల నిర్వహణపై ఉద్యోగులకు స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ విభాగం ప్రధాన విధి. నియమావళి అమలుపై శిక్షణ ఇచ్చారు.


సామగ్రి పంపిణీ: ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి గుర్తించడం, వాటిని సమకూర్చుకోవడం వంటి వాటికి ఈ విభాగం పనిచేస్తుంది.


రవాణా సౌకర్యం: పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందితో పాటు సామగ్రి రవాణా చేయడమే ఈ విభాగం పని. జిల్లాల్లోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని, ఈవీఎలు, పోలీసులను సకాలంలో చేర్చటం ఈ విభాగం విధి. ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడంలోనూ భాగస్వామ్యం.


శాంతి భద్రతల పరిరక్షణ: సమస్మాత్మక పోలింగ్‌ కేంద్రాలను ముందే గుర్తించి వాటిపై నిఘూ పెట్టడం, ఆయుధాలు ఉన్న వారి వివరాల సేకరణ, తదితర కార్యకలాపాలను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది.


ఈవీఎంల నిర్వహణ: ఓటింగ్‌లో కీలకమైన ఈవీఎంలను కేంద్రాలకు చేర్చటం నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్ట్రాంగ్‌ గదుల్లో భద్రపరుస్తారు. వీటిని నిర్వహిస్తుంది.


ఐటీ, కంప్యూటరైజేషన్‌: సాంకేతిక అంశాలపై ఐటీ, కంప్యూటరైజేషన్‌ విభాగం పని చేస్తుంది. యాప్‌ల పని తీరు, వాటి నిర్వహణను పర్యవేక్షిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ సమస్యలను పరిష్కరిస్తుంది.


ప్రవర్తన నియమావళి: రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియమావళి ఉల్లంఘనలపై దృష్టిపెడుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది.


వ్యయ నిర్ధారణ: అభ్యర్థుల ఖర్చులను లెక్కించటానికి వ్యయ నిర్ధాణ విభాగం పని చేస్తుంది. సభలు, సమావేశాలు, వ్యయాన్ని ఆయా అభ్యర్థుల ఖర్చుల్లో చూపిస్తుంది. ఖర్చులకు సంబంధించిన వీడియో, సీడీలను రూపంలో ఎన్నికల సంఘానికి పంపిస్తుంది.


ఫిర్యాదులపై స్పందన: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఈ విభాగం స్పందిస్తుంది. డయల్‌ 1950, సి-విజిల్‌, సువిధ యాప్‌ల వంటి వాటికి అందే ఫిర్యాదులను రికార్డు చేసుకుని పరిష్కరిస్తుంది.


పోస్టల్‌ బ్యాలెట్‌: జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ సిబ్బందిని గుర్తించి వారంతా ఓటేసేలా ఇది పని చేస్తుంది.


ప్రసార సాధనాలపై: మీడియాలో ప్రసారం, ప్రచురితమయ్యే వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నియమావళికి విరుద్ధంగా ఉన్న వాటిని గుర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని