logo

చిరుధాన్యాలకు ప్రాధాన్యం

ఒకప్పుడు చిరుధాన్యాలతో రాగి సంగటి, అంబలి, కొర్ర అన్నం, జొన్న రొట్టెలు తిని ఆరోగ్యంగా ఉండేవారు. అనంతర కాలంలో ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపడంతో అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యారు.

Published : 27 Mar 2023 04:08 IST

పెరుగుతున్న సాగు, వినియోగం

చిరుధాన్యాల సాగులో గిరిజన రైతులు

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ఒకప్పుడు చిరుధాన్యాలతో రాగి సంగటి, అంబలి, కొర్ర అన్నం, జొన్న రొట్టెలు తిని ఆరోగ్యంగా ఉండేవారు. అనంతర కాలంలో ఫాస్ట్‌ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపడంతో అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యారు. కరోనా కుదిపేసిన తర్వాత చాలా మంది మళ్లీ చిరుధాన్యల ఆహారంపై ఆసక్తి చూపుతున్నారు. రాగులు, సామలు, కొర్రలు, ఊదలు, జొన్నలు, గంటెలు మొదలైన వాటితో తయారవుతున్న వంటకాలకు ప్రాధాన్యమివ్వడంతో ఆ పంటలకు డిమాండ్‌ పెరిగింది.  

విస్తీర్ణం ఇలా..

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 1,415 హెక్టార్ల విస్తీర్ణంలో చిరుధాన్యాలు సాగుచేస్తున్నారు. వీటిలో రాగులు 1,265 హెక్టార్లు, సామలు 36, కొర్రలు 20, గంటెలు 69, జొన్నలు 25 హెక్టార్లతో పాటు ఊదలు, అరికెలు వంటివి పండిస్తున్నారు. తక్కువ సారం ఉన్న భూముల్లో, అంతర పంటగా కొందరు సాగు చేస్తున్నారు.

గులిరాగి పద్ధతిలో ..

ఒకప్పుడు కొండ, పోడు భూముల్లో మాత్రమే పండే చిరుధాన్యాల సాగు నేడు మైదాన ప్రాంతానికి విస్తరించింది.  శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సలహాలు పాటిస్తూ రైతులు వినూత్న పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 210 మంది రైతులు 225 ఎకరాల్లో ‘గులి రాగి’ సాగుకు శ్రీకారం చుట్టారు. శ్రీ వరిసాగు విధానంలా రాగి చేనును వరుసలో నాటి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సాధారణ పద్ధతిలో ఎకరాకు 2-3 క్వింటాళ్లు వచ్చే దిగుబడి గులిరాగి పద్ధతిలో 5-6 క్వింటాళ్ల వరకు ఉంటుంది.


ఇవీ ఉపయోగాలు..

జొన్నలు: జీవక్రియను అభివృద్ధి చేస్తుంది. ఆహారంగా కాకుండా పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. వర్షాభావ పరిస్థితులను తట్టుకొని పెరుగుతాయి.
సజ్జలు: చక్కెర వ్యాధి నియంత్రణను దోహదం చేస్తుంది.  
కొర్రలు: రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ నిల్వలు తగ్గుతాయి.  
రాగులు: కాల్షియం, ప్రోటీన్లు, ఇనుము ఎక్కువ. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అరికలు: చక్కెర వ్యాధి నియంత్రణ. రోగ నిరోధక శక్తి పెరుగుదల.  
ఊదలు: పీచు పదార్థాలు, కాల్షియం, పాస్పరస్‌ అధికంగా ఉంటాయి. చక్కెర అదుపులో ఉంటుంది.
సామలు: ఇనుము శాతం ఎక్కువ, రక్తహీనతను తగ్గిస్తుంది. చక్కెర, జీర్ణవ్యవస్థకు సంబంధించిన రోగాల నుంచి రక్షణ.  


అంబలే బలం..
- టి.డబ్బ, కన్నయ్యగూడ, గుమ్మలక్ష్మీపురం

నా చిన్నప్పటి నుంచి చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకుంటున్నా. రోజుకు రెండు పూటలా రాగి అంబలి తాగుతా. ఒక్కపూట అన్నం తింటా. ఇప్పటి వరకు ఎలాంటి వ్యాధుల బారిన పడలేదు. 75 ఏళ్ల వయసులోనూ పొలం పనులకు వెళ్తున్నా. ఏడాదికి సరిపడా రాగులు, కందులు పండిస్తున్నాం.


రోగ నిరోధక శక్తి పెరుగుదల..  
- స్వర్ణలత, పోషకాహార నిపుణులు, విజయనగరం

పోషక విలువలు ఎక్కువగా ఉండే చిరుధాన్యాలను తీసుకోవడంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో పీచు పదార్థాలు అధికం. రక్తపోటు, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. కరోనా తర్వాత చిరుధాన్యాలు, పోషకపదార్థాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది.  


రైతులకు ప్రోత్సాహం..
- డాక్టర్‌ టీఎస్‌ఎస్‌కే పాత్రో, కేవీకే సమన్వయకర్త

చిరుధాన్యాల సాగుకు జిల్లా నేలలు అనుకూలంగా ఉండటంతో గిరిజన రైతులను ప్రోత్సహిస్తున్నాం. దీనిలో భాగంగా కేవీకేలో చిరుధాన్యాల విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నాం. జూన్‌ నాటికి సుమారు 5 టన్నుల విత్తనాలు రైతులకు ఉచితంగా అందించేందుకు కృషి చేస్తున్నాం. దీంతో తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేసుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులు, బంజరు భూముల్లో లాభసాటి వ్యవసాయానికి అనుకూలం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని