logo

వేధిస్తున్న.. ఎడతెగని పొడిదగ్గు

తొలుత గొంతు నొప్పి.. ఆపై పొడిదగ్గు.. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఫ్లూ జ్వరాలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Published : 09 Mar 2023 03:47 IST

ఒళ్లు నొప్పులు, జ్వరం లక్షణాలు
కేజీహెచ్‌కు పెరుగుతున్న బాధితులు
న్యూస్‌టుడే, వన్‌టౌన్‌

తొలుత గొంతు నొప్పి.. ఆపై పొడిదగ్గు.. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి లక్షణాలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఫ్లూ జ్వరాలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి జ్వరాలతో బాధపడుతూ కేజీహెచ్‌ మెడిసిన్‌ ఓపీ విభాగాలకు వస్తున్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓపీ విభాగాల్లో చికిత్స తీసుకొని వెళుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని కేజీహెచ్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ డి.రాధాకృష్ణ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.


వాతావరణ మార్పులే కారణం..

నగరంలో ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత పెరుగుతోంది. అయితే రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. మరో పక్క తెల్లవారు జామున మంచు కురుస్తోంది. ఆయా వాతావరణ పరిస్థితులకు ప్రభావితం అయ్యే వారిలో పొడిదగ్గు, జలుబుతో మొదలై జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు పెరిగి అస్వస్థతకు దారి తీస్తోంది. గతంలో ఇటువంటి వాతావరణంలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం బాధితుల నుంచి నమూనాలు సేకరించి కేజీహెచ్‌ ఆవరణలోని వైరాలజీ ల్యాబ్‌లో స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేస్తున్నారు. ఆయా పరీక్షల్లో స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కాలేదు. దీంతో సాధారణ వైరల్‌ ఫ్లూ జ్వరాలుగా భావించి చికిత్స అందిస్తున్నారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు నాలుగు రోజుల్లో తగ్గుతున్నప్పటికీ దగ్గు తగ్గడానికి వారం పడుతోంది. కొంత మందిలో పది రోజులైనా తగ్గడం లేదు.

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు


రోజుకు 40 నుంచి 50 మంది..

కేజీహెచ్‌ మెడికల్‌ ఓపీ సెలవు దినాలు మినహా ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. జ్వరాలతో బాధపడుతూ రోజుకు 40 నుంచి 50 మంది వస్తున్నారు. వీరిలో అయిదారుగురు మాత్రమే ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రైవేటు క్లీనిక్కులను ఆశ్రయించే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. హెచ్‌3ఎన్‌2 ఫ్లూ వేరియంట్‌ కేసులు వస్తున్నాయని ప్రచారం సాగుతున్నా... నగరంలో ఇంత వరకు ఒక్క కేసులో కూడా ఆ వేరియంట్‌ నిర్ధారణ కాలేదు. హెచ్‌3ఎన్‌2 కేసులను నిర్ధారించాలంటే ఐసీఎంఆర్‌ నుంచి ప్రత్యేకంగా కిట్లు రప్పించాల్సి ఉంది. కేజీహెచ్‌లో అటువంటి కిట్లు అందుబాటులో లేవు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ‘బాధితులు చల్లటి నీరు తాగరాదు. ఎండల్లో ఎక్కువగా తిరగకూడదు. ఒక వేళ బయటకెళితే ఎండ ప్రభావం తగ్గించేందుకు గొడుగులు వేసుకోవాలి. మంచు అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు సాగించకపోవడమే మేలు. శానిటైజర్‌, మాస్కులు వాడాలి. తలనొప్పి, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాల’ని డాక్టర్‌ రాధాకృష్ణ సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని