logo

సరైన తిండి లేదు.. చచ్చి బతికాం..!

‘పాకిస్తాన్‌లోని కరాచీ జైలు నుంచి బయట పడతామనుకోలేదు. నాలుగున్నరేళ్లు చీకటిలో మగ్గాం. అక్కడి భాష రాదు. జైలు అధికారులు ఏమి చెబుతున్నారో అర్థమయ్యేది కాదు.

Published : 31 May 2023 03:43 IST

పాకిస్తాన్‌ జైలు నుంచి బయటపడ్డ మత్స్యకారులు

సమావేశంలో మాట్లాడుతున్న జానకీరామ్‌, చిత్రంలో విశాఖకు చేరిన మత్స్యకారులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ‘పాకిస్తాన్‌లోని కరాచీ జైలు నుంచి బయట పడతామనుకోలేదు. నాలుగున్నరేళ్లు చీకటిలో మగ్గాం. అక్కడి భాష రాదు. జైలు అధికారులు ఏమి చెబుతున్నారో అర్థమయ్యేది కాదు. దేవుడి దయతో జైలు నుంచి విముక్తి కలిగింది. పాకిస్తాన్‌ నుంచి గుజరాత్‌, అక్కడి నుంచి విశాఖ చేరుకున్నాం’అని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామానికి చెందిన మత్స్యకారుడు మైలపల్లి భాస్కర్‌రావు, తూ.గో. జిల్లా గజ్జికాయలపురం గ్రామానికి చెందిన మాదే అన్నవరం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం గ్రామం పసుపులంక గ్రామానికి చెందిన పి.నారాయణరావు పేర్కొన్నారు. వీరిని మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ మర పడవల ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు వాసుపల్లి జానకీరామ్‌ విశాఖ తీసుకొచ్చారు. అనంతరం చేపలరేవులోని సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ  ‘2018 నవంబరు 18న మేము గుజరాత్‌ రాష్ట్రంలోని వీరావల్‌ తీరంలో వేట సాగిస్తున్నాం. మా బోటు పాకిస్తాన్‌ జలాల్లోకి వెళ్లిందని పాక్‌ కోస్టుగార్డు పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 23 మందిని పట్టుకున్నారు. వీరిలో 22 మంది నాలుగేళ్ల క్రితమే విడుదలయ్యారు. నేను ఒక్కడిని ఉండిపోయాను. వివిధ రకాల దౌత్య సంప్రదింపుల తర్వాత ఇటీవల నాతో పాటు తూ.గో., అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు మత్స్యకారులను విడుదల చేశారు’ అని చెప్పారు. తండ్రి రెండేళ్ల కిత్రం చనిపోయిన విషయం కూడా తనకు తెలియదని వాపోయారు. సరైన భోజనం పెట్టలేదని, అక్కడి జైళ్లు నరకానికి నకళ్లుగా ఉన్నాయన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చచ్చి బతికామని కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు భారతీయ మత్స్యకారులు పాక్‌ జైళ్లలో మగ్గుతున్నారని తెలిపారు.

* పాక్‌ జైళ్ల నుంచి విడుదలైన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ మర పడవల ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు వాసుపల్లి జానకీరామ్‌ డిమాండ్‌ చేశారు. గతంలో ఇలాంటి బాధితులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లించిందని చెప్పారు. అదే తరహాలో వీరికి ఇవ్వాలని కోరారు. మత్స్యకారులు ఈనెల 13న గుజరాత్‌కు చేరుకున్నారని, అక్కడ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారని, పూర్తిగా కోలుకున్న తర్వాత విశాఖ తీసుకొచ్చామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని