logo

Kodi Kathi: కోడికత్తితో బాబాయిపై దాడి.. చికిత్స పొందుతూ బాధితుడి మృతి

పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడు వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని విచక్షణ రహితంగా పొడిచి హతమార్చాడు. ఈ ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది.

Updated : 31 Oct 2023 18:28 IST

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడు వరసకు బాబాయి అయ్యే వ్యక్తిని విచక్షణ రహితంగా పొడిచి హతమార్చాడు. ఈ ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌ చెరువు రోడ్డులో నివాసం ఉంటున్న ఇళ్ల శ్రీనివాసు (23)కు, వరసకు బాబాయి అయిన గోసుల ఏడుకొండలు అలియాస్‌ బాలాజీ (27) మధ్య పాత గొడవలున్నాయి. వారి మధ్య గొడవలను సర్దుబాటు చేసుకునేందుకు ఏడుకొండలు, శ్రీనివాసు స్నేహితులతో కలిసి గాంధీబొమ్మ సెంటర్‌కు వచ్చారు. వీరిద్దరి మధ్య తిరిగి ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో శ్రీనివాసు తన వెంట తెచ్చుకున్న కోడికత్తితో ఏడుకొండలుపై విచక్షణారహితంగా దాడిచేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఏడుకొండలుకు తీవ్ర రక్తస్రావమైంది. స్నేహితులు వెంటనే స్థానిక ప్రాంతీయాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై మల్లికార్జునరెడ్డి తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు శ్రీనివాసును అదుపులోకి తీసుకున్నారు. ఏడుకొండలు పెయింటర్‌గా పనిచేస్తున్నారు. అతనికి భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని