icon icon icon
icon icon icon

‘నోర్ముయ్‌.. నాకు కుదిరినప్పుడే సమస్యలు పరిష్కరిస్తా’

‘నాకు ఇష్టమొచ్చినప్పుడు, నాకు కుదిరినప్పుడే చేస్తా.. నోర్ముయ్‌.. నువ్వు ఎవరు చెప్పడానికి’ అంటూ సమస్యలు ప్రస్తావించిన వారిపై పల్నాడు జిల్లా గురజాల వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ఆగ్రహంతో రెచ్చిపోయారు.

Published : 30 Apr 2024 06:06 IST

గ్రామస్థులతో వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: ‘నాకు ఇష్టమొచ్చినప్పుడు, నాకు కుదిరినప్పుడే చేస్తా.. నోర్ముయ్‌.. నువ్వు ఎవరు చెప్పడానికి’ అంటూ సమస్యలు ప్రస్తావించిన వారిపై పల్నాడు జిల్లా గురజాల వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి ఆగ్రహంతో రెచ్చిపోయారు. గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో ఆదివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి 10:30 సమయంలో ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణం కాగా.. కొందరు గ్రామస్థులు ఆయన వద్దకు వచ్చి సమస్యలు చెప్పేందుకు ప్రయత్నించారు. సచివాలయాన్ని తమ గ్రామం నుంచి 8 కి.మీ. దూరంలోని మరో ఊరికి తరలించడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని మొరపెట్టుకున్నారు. మహేశ్‌రెడ్డి.. చేద్దాం, చూద్దాం అని సమాధానం ఇస్తూ ముందుకు కదిలిపోయారు. తమకు సమాధానం చెప్పి వెళ్లాలని ప్రతీసారీ చేద్దాం.. చూద్దాం.. అంటే కుదరదని స్థానికులు పట్టుబట్టారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ‘నాకు కుదిరినప్పుడు చేస్తా.. నువ్వు ఎవడివోయ్‌ చెప్పడానికి’ అని ప్రశ్నించారు. ఎప్పుడు కుదురుతుంతో చెప్పాలని మరోసారి అడగ్గా.. నోర్ముయ్‌ అంటూ వారిపైకి దూసుకెళ్లారు. కొంతమంది ఆయన కారుకు అడ్డుగా నిలబడటంతో వారిపై నుంచి పోనివ్వాలని డ్రైవర్‌కు సూచించారు. దీంతో తొందరలో బుద్ధి చెబుతామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వారందరూ వైకాపా వారే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img