నకిలీ ధ్రువపత్రాలతో విద్యార్థులకు కేవీల్లో ప్రవేశం.. ప్రిన్సిపల్‌పై సీబీఐ కేసు

నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులైన విద్యార్థులకు కేంద్రీయ విద్యాలయలో ప్రవేశం కల్పించినందుకు ఓ ప్రిన్సిపల్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

Published : 21 Sep 2023 18:57 IST

దిల్లీ/విశాఖపట్నం: నకిలీ ధ్రువపత్రాలతో విద్యార్థులకు ప్రవేశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా వాల్తేరు కేంద్రీయ విద్యాలయ (KV) ప్రిన్సిపల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకు గురువారం సీబీఐ అధికారులు కేసు వివరాలను వెల్లడించారు. వాల్తేరులోని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ఎస్‌ శ్రీనివాస రాజా అనే వ్యక్తి గత రెండేళ్లలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లంచం తీసుకుని వివిధ కేంద్ర విద్యా సంస్థల పేరుతో ఉన్న నకిలీ ధ్రువపత్రాలతో 193 మంది విద్యార్థులకు పాఠశాలలో అక్రమంగా ప్రవేశం కల్పించినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. 

భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై విదేశాల్లోనూ ప్రాక్టీస్‌ చేయొచ్చు

2021-22 విద్యా సంవత్సరంలో 124 మంది, 2022-23లో 69 మంది విద్యార్థులకు అక్రమంగా ప్రవేశం కల్పించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే 3, 4 తేదీల్లో సీబీఐ విశాఖపట్నం డివిజన్‌ అధికారులు వాల్తేరులోని కేవీలో ప్రవేశాల వివరాలపై తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ శ్రీనివాస రాజా నకిలీ ధ్రువపత్రాలతో అర్హతలేని విద్యార్థులకు ప్రవేశం కల్పించినట్లు గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాలకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి యూపీఐ ద్వారా నగదు బదిలీ జరిగినట్లు విచారణలో తేలింది. దీంతో విచారణ ప్రారంభించిన సీబీఐ, తాజాగా కేసు నమోదు చేసింది. కేంద్రీయ విద్యాలయ కమిషనర్‌ నుంచి అనుమతి పొందిన తర్వాత శ్రీనివాస రాజాపై చర్యలు తీసుకుంటామని సీబీఐ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని