Border Fencing: మయన్మార్‌ సరిహద్దులో.. 1643 కిలోమీటర్ల కంచె : అమిత్‌ షా

భారత్‌- మయన్మార్‌ సరిహద్దులో మొత్తం 1,643 కిలోమీటర్ల కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు.

Published : 06 Feb 2024 21:17 IST

దిల్లీ: భారత్‌- మయన్మార్‌ల సరిహద్దు (Indo-Myanmar border)లో మొత్తం 1,643 కిలోమీటర్ల మేర కంచెను (Fencing) నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. పటిష్ఠమైన నిఘాను మరింత సులభతరం చేసేందుకుగానూ సరిహద్దు వెంబడి గస్తీ మార్గాన్ని (Patrol Track) కూడా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. అభేద్యమైన సరిహద్దుల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

‘‘ఇరు దేశాల మధ్య సరిహద్దును పూర్తిగా కవర్‌ చేస్తూ.. 1,643 కిమీ పొడవునా కంచెను నిర్మిస్తాం. మణిపుర్‌లోని మోరేలో ఇప్పటికే 10 కిలోమీటర్ల మేర కంచె వేశాం. హైబ్రిడ్ నిఘా వ్యవస్థ (HSS) ద్వారా మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో కిలోమీటరు చొప్పున ఫెన్సింగ్‌ ఏర్పాటుకు పైలట్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. మణిపుర్‌లో సుమారు 20 కి.మీ. మేర పనులకు కూడా ఆమోదం లభించింది. త్వరలోనే అవి ప్రారంభమవుతాయి’’ అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

చొరబాట్లకు కంచె!

ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లు మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటివరకు సరిహద్దు నుంచి ఇరువైపులా 16 కిలోమీటర్ల వరకు ఎలాంటి వీసా లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వెసులుబాటు ఉంది. అయితే.. ఆ దేశం నుంచి భారత్‌లోకి అక్రమ చొరబాట్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మణిపుర్‌ సంక్షోభం, మయన్మార్‌లో అంతర్యుద్ధంతో పరిస్థితులు ప్రభావితమయ్యాయి. ఇలాంటివి అరికట్టేందుకు ఆ దేశ సరిహద్దు వెంబడి కంచె వేస్తామని అమిత్‌ షా గత నెలలోనే ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని