Sushant Singh Rajput: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు.. ఫడణవీస్‌ కీలక వ్యాఖ్యలు

Sushant Singh Rajput Death Case: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో కీలక సాక్ష్యాలను సేకరించినట్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

Published : 29 Jun 2023 12:27 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) మరణంపై మిస్టరీ ఇంకా వీడట్లేదు. తాజాగా ఈ కేసుపై మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతిపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు గురించి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) స్పందిస్తూ.. ‘‘ఈ కేసులో తొలుత ఉన్న సమాచారం వాళ్లూవీళ్లు చెప్పిన మాటల ఆధారంగానే ఉంది. కానీ, ఆ తర్వాత కొంతమంది ఈ కేసుకు సంబంధించి తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. దానిపై మేం చర్యలు చేపట్టాం. వారి వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించాలని కోరాం. ప్రాథమిక సాక్ష్యాలను సేకరించాం. ప్రస్తుతం వాటి విశ్వసనీయతను అధికారులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దశలో నేను కేసు గురించి ఏం చెప్పలేను’’ అని వెల్లడించారు.

2020 జూన్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput) ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా కన్పించిన విషయం తెలిసిందే. ఆయన మృతి బాలీవుడ్‌తో సహా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను షాక్‌కు గురిచేసింది. తొలుత ఆయనది ఆత్మహత్య అని వార్తలు వచ్చాయి. అయితే సుశాంత్‌ మృతిలో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే, మూడేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లభించకపోవడం గమనార్హం. మరోవైపు సుశాంత్‌ మరణానికి వారం రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని