Delta variant: ‘డెల్టా’ దెబ్బ: అమెరికాలో 1.3 లక్షల కేసులు.. చైనాలో కోటికి పైగా పరీక్షలు

రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి.

Published : 08 Aug 2021 17:50 IST

శ్రీలంకలో ఆందోళనకర పరిస్థితులు

వాషింగ్టన్‌/బీజింగ్‌/కొలంబో: రోజురోజుకీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ప్రధానంగా కరోనా వైరస్‌ డెల్టా రకం వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో.. అమెరికాలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి. చైనా భారీఎత్తున కొవిడ్‌ పరీక్షలు జరుపుతోంది. శ్రీలంకలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అమెరికాలో ఉద్ధృతి..

అమెరికాలో శుక్రవారం 1.3 లక్షలకు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. జూన్‌ నెల చివరిలో సగటున రోజువారీ కేసుల సంఖ్య 11 వేలకు తగ్గిపోయిన అమెరికాలో ఈనెల 3 నుంచి రోజూ లక్షకు పైగా నమోదవుతున్నాయి. జూన్‌ నెలతో పాటు జులై మొదటి వారంలోనూ కేసుల సంఖ్య 20 వేల లోపునకే పరిమితం కాగా తర్వాతి నుంచి క్రమేపీ కేసుల పెరుగుదల మొదలైంది. గత ఏడాది కరోనా మొదటి ఉద్ధృతిలో రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటడానికి 9 నెలలు పట్టగా ఇప్పుడు 6 వారాల్లోనే ఆ సంఖ్యను దాటేయడం తీవ్రతను తెలుపుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాలు కూడా పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం రోజుకి 270 కొవిడ్‌ మరణాలు సంభవించగా శుక్రవారం నాటికి ఆ సంఖ్య 700 దాటింది.

అమెరికాలో ప్రధానంగా టీకా తీసుకోని వారిలో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతంలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరింత మంది అమెరికన్లు టీకాలు తీసుకోకపోతే కేసుల పెరుగుదల ఇంకా తీవ్రంగా ఉండొచ్చని ఆరోగ్య అధికారులే భయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 41% ఫ్లోరిడా, జార్జియా, అలబామా, మిసిసిపీ, కరోలినా (ఉత్తర, దక్షిణ), టెన్నెస్సీ, కెంటకీల్లోనే ఉంటున్నారు.

వుహాన్‌లో 1.12 కోట్ల మందికి పరీక్షలు

కరోనా చైనాను కూడా మళ్లీ వణికిస్తున్న నేపథ్యంలో.. తొలిసారి వైరస్‌ బయటపడిన వుహాన్‌ నగరంలో 1.12 కోట్ల మందికి (మొత్తం జనాభా 1.20 కోట్లు) కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు (న్యూక్లియక్‌ యాసిడ్‌ టెస్టింగ్‌) జరిపినట్లు అధికారులు  తెలిపారు.  ఈ నెల 4 నుంచి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. శుక్రవారం నాటికి ఈ నగరంలో 21 కేసులు బయటపడ్డాయి. హుబేయ్‌ ప్రావిన్స్‌లో 47 కేసులు నమోదయ్యాయి. చైనాలో శనివారం 139 మందికి కొత్తగా వైరస్‌ సోకింది.

శ్రీలంక ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక..

శ్రీలంకలో కరోనా డెల్టా రకం వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తికీ కొవిడ్‌ ముప్పు పొంచి ఉందని..  ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. శనివారం నాటికి దేశంలో కొవిడ్‌తో చనిపోయినవారి సంఖ్య 5 వేలకు చేరింది. గత కొద్ది రోజులుగా శ్రీలంకలో కేసులు, మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ‘‘డెల్టా రకం సోకినవారిలో 
1.5% మంది మృత్యువాత పడుతున్నారు. రోగుల్లో ఎక్కువ మందికి ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సి వస్తోంది’’ అని ప్రభుత్వం పేర్కొంది.  దేశంలో లాక్‌డౌన్‌ విధించడానికి ప్రభుత్వం విముఖంగా ఉంది. మే నెలలో విధించిన ప్రయాణ ఆంక్షలను మాత్రం కొనసాగిస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని