US Army: అమెరికా సైనిక కుటుంబాల్లో ఆకలి కేకలు 

 అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. ఆ దేశ సైన్యాన్ని చూసి చాలా దేశాలు గడగడలాడతాయి. అలాంటి అమెరికాలో దాదాపు 1,60,000 మంది సైనికులు 

Updated : 16 Nov 2021 11:35 IST

 కరోనాతో దెబ్బతిన్న ఆదాయాలు.. ఉచిత ఆహారం కోసం క్యూలు

శాన్‌డియాగో: అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. ఆ దేశ సైన్యాన్ని చూసి చాలా దేశాలు గడగడలాడతాయి. అలాంటి అమెరికాలో దాదాపు 1,60,000 మంది సైనికులు తమ కుటుంబాలను పోషించుకోలేక పోతున్నారంటే నమ్మగలరా..? ‘‘ఆశ్చర్యమనిపించొచ్చు. కానీ ఇది చేదు నిజం’’ అంటోంది ‘ఫీడింగ్‌ అమెరికా’ సంస్థ. ‘‘కరోనా దెబ్బకు సైనిక కుటుంబాలు అతలాకుతలమయ్యాయి. దిగువస్థాయిలో పనిచేసేవారి జీతాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. చాలా మంది సైనికుల భార్యలు కూడా ‘కొవిడ్‌’ సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు.’’ అని ఫీడింగ్‌ అమెరికా పేర్కొంది. కరోనాకు ముందు సైనికుల భార్యలూ ఉద్యోగాలు చేసేవారు. రెండు ఆదాయాలతో సమస్యలంతగా ఉండేవి కావు. కానీ కరోనా చాలా మందిని నిరుద్యోగులుగా మార్చేసింది. దీంతో ఇంట్లో పిల్లలకు వేళకు తిండిలేని పరిస్థితి నెలకొంది. ‘‘ఈ కఠిన వాస్తవం సాధారణ అమెరికన్లకు తెలియకపోవచ్చు. సైన్యంలో చాలా మందికి తెలుసు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైన్యంలో మేం సభ్యులం. మా కుటుంబాలకు మాత్రం తిండి దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని కాపాడటంపై వారెలా దృష్టి పెట్టగలరు’’ అని ఇరాక్‌ యుద్ధంలో రెండు కాళ్లు కోల్పోయిన బ్లాక్‌హాక్‌ పైలట్‌ టేమీ డక్‌వర్త్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య సైన్యంలోని అన్ని విభాగాల్లోనూ ఉందని సెయింట్‌ లూయిస్‌లో ఫుడ్‌బ్యాంక్‌ను నిర్వహించే నాప్‌ తెలిపారు. కరెంటు బిల్లులు చెల్లించలేక, చీకట్లోనే తన కుటుంబంతో బతకడానికి సిద్ధమైన యువ సైనికాధికారి గురించి తనకు తెలుసని ఆమె చెప్పారు. ‘‘సైన్యంలోకి వెళ్లిన తర్వాత ఒకరిని సాయం అడగడం చాలా మంది అగౌరవంగా భావిస్తారు. అందుకే చాలా కుటుంబాలు తిండి దొరకక ఇబ్బందిపడుతున్నా బయటపడటం లేదు. సైన్యంలో దిగువస్థాయి ర్యాంకుల్లో పని చేసే సైనిక కుటుంబాల్లో 29 శాతం మంది తమ పిల్లలకు వేళకు ఆహారం అందించలేకపోతున్నారు’’ అని ఫీడింగ్‌ అమెరికా సంస్థ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని