Corruption: లంచం కోసం ‘మంత్రి’ ఒత్తిడి.. కన్నడనాట ‘లేఖ’ కలకలం..!

కర్ణాటకలో (Karnataka) వ్యవసాయశాఖ మంత్రి లంచం కోసం అధికారులను వేధిస్తున్నారనే ఆరోపణలు, అందుకు సంబంధించిన ఫిర్యాదు లేఖ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Updated : 08 Aug 2023 16:24 IST

బెంగళూరు: కర్ణాటకలో (Karnataka) ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు (Corruption) గుప్పుమన్నాయి. ఏకంగా ఆ రాష్ట్ర మంత్రే.. లంచం కోసం అధికారులను వేధిస్తున్నట్లు ఆరోపణలు రావడం గమనార్హం. ఈ వ్యవహారంపై కొందరు ఉన్నతాధికారులు గవర్నర్‌కే ఫిర్యాదు చేస్తూ ‘లేఖ’ రాయడం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేసింది. అయితే, ఆ లేఖ నకిలీదని పేర్కొన్న ప్రభుత్వం.. సదరు మంత్రిపై వచ్చిన ఆరోపణలు, లేఖ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు (CID Probe) చేయాలని ఆదేశించింది.

వ్యవసాయశాఖకు చెందిన జాయింట్‌ డైరెక్టర్ల ద్వారా తనకు ప్రతినెలా తలా రూ.8లక్షలు లంచం ఇవ్వాలని ఆ శాఖ ఉద్యోగులపై మంత్రి చెలువరాయస్వామి (Chaluvarayaswamy) ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మండ్య జిల్లా వ్యవసాయశాఖకు చెందిన ఏడుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లు గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌కు రాసినట్లు ఉన్న లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఇలాంటి అవినీతి ‘సంప్రదాయాన్ని’ నియంత్రించకుంటే తమ కుటుంబాలతో కలిసి ఆత్మహత్యలకు పాల్పడతామని బాధితులు హెచ్చరించారు. ఆ లేఖను చీఫ్‌ సెక్రటరీ వందితా శర్మకు పంపించిన గవర్నర్‌ గహ్లోత్‌.. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారనే వార్తలు వచ్చాయి.

‘చివరి బంతికి సిక్స్‌ కొట్టండి’.. అవిశ్వాసం వేళ ఎంపీలకు మోదీ సూచన

ఈ ‘లేఖ’ వ్యవహారంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అది నకిలీదని పేర్కొన్నారు. భాజపా, వారి మిత్రపక్షం (జేడీఎస్‌ను ఉద్దేశిస్తూ) దానిని సృష్టించాయని ఆరోపించారు. అయినప్పటికీ మంత్రిపై వచ్చిన ఆరోపణల కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన సిద్ధరామయ్య.. ఆ లేఖ నకిలీదని, అటువంటి లేఖను ఏ అధికారి రాయలేదని వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ చెప్పారని అన్నారు. అటు ఈ వ్యవహారంపై భాజపా, జేడీఎస్‌తోపాటు ఆమ్‌ఆద్మీ పార్టీలు మండిపడ్డాయి. ఒకవేళ అది నకిలీదైతే గవర్నర్‌ ఎందుకు స్పందిస్తారని ప్రశ్నించాయి. ఇలా అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రిని సీఎం వెనకేసుకురావడం దారుణమని దుయ్యబట్టాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని