Car Runs On Wine: మద్యంతో నడుస్తున్న బ్రిటన్‌ యువరాజు కారు

స్వయానా ఓ దేశ యువరాజు తన కారు మద్యంతోనే నడుస్తోందని ప్రకటించారు. రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన......

Published : 14 Oct 2021 02:42 IST

లండన్‌: మద్యం తాగి కారును నడపడం నేరం.. కానీ కారే మద్యం సేవించి రోడ్లపై పరుగులు తీస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నూటికి నూరుశాతం నిజం. స్వయానా ఓ దేశ యువరాజు తన కారు మద్యంతో నడుస్తోందని ప్రకటించారు.  బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజసౌధంలో మిగిలిపోయిన వైన్‌ను పోసి ఆస్టోన్ మార్టిన్ కారులో యువరాజు చక్కర్లు కొడుతున్నారు.

కార్లకు ఇంధనంగా డీజిల్‌, పెట్రోల్‌, సీఎన్‌జీ గ్యాస్‌లను వినియోగిస్తారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు కార్ల వాడకం పెరుగుతోంది. అయితే బ్రిటీష్ యువరాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌ (72) మరో అడుగు ముందుకేసి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఆస్టోన్ మార్టిన్ కారును వైన్‌తో నడిపిస్తున్నారు. తన 21వ ఏట (51 ఏళ్ల క్రితం) బహుమతిగా అందుకున్న ఆస్టోన్ మార్టిన్ కారంటే ప్రిన్స్‌ చార్లెస్‌కు ఎంతో ఇష్టం. యువరాజు అభిరుచులకు తగ్గట్లుగా ఇంజినీర్లు తీవ్రంగా శ్రమించి.. ఈ కారును వైన్‌తో నడిచేలా రీడిజైన్‌ చేశారు. వారి కృషి ఫలించి ప్రస్తుతం రాజుగారి కారు వైన్‌తో నడుస్తోంది. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో మిగిలిపోయిన వైన్‌ను ఈ కారుకు ఇంధనంగా వినియోగిస్తున్నారు. కొన్నిసార్లు జున్ను తయారీ చేస్తుండగా విరిగిపోయిన పాలను సైతం ఈ కారులో ఇంధనంగా వాడుతున్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిన్స్‌ ఈ విషయాలను వెల్లడించారు.

కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రపంచ నేతలు చేస్తున్న కృషికి తన వంతు సహకారం అందించేందుకు పెట్రోల్‌, డీజిల్‌ బదులు వైన్‌ను ఉపయోగిస్తున్నానని ప్రిన్స్‌ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ నెల 31న సమావేశం జరగనుంది. దీనిపై యువరాజు మాట్లాడుతూ.. భూగోళాన్ని రక్షించేందుకు ఐరాస జీవవైవిద్య శిఖరాగ్ర సమావేశంలో దేశాలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన  పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని