Free smartphones: కోటి మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు!

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో కోటిమంది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఉచితంగా ......

Updated : 20 Dec 2021 18:51 IST

ఎన్నికల వేళ యోగి సర్కార్‌ కీలక ప్రకటన

లఖ్‌నవూ: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో కోటిమంది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయీ జయంతి రోజున (డిసెంబర్‌ 25న) వీటి పంపిణీ తొలి దశను ప్రారంభించనున్నారు. ఆ రోజు లక్ష స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో యువతకు లాప్‌టాప్‌లు కూడా ఇవ్వలేదని, ఆయనకు కూడా ఇప్పటికీ ల్యాప్‌టాప్‌ ఎలా వాడాలో కూడా తెలియదంటూ ఇటీవల రాయ్‌బరేలీలో నిర్వహించిన సభలో సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. అలాగే, గతంలో తాము పంపిణీ చేసిన ల్యాప్‌టాప్‌లు ఇప్పటికీ పనిచేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఏకంగా కోటి మందికి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించడం గమనార్హం.

ఎవరెవరికి ఇస్తారు? 
రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థినులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోజున 60వేల స్మార్ట్‌ఫోన్లు, 40వేల ట్యాబ్‌లను యువతకు పంపిణీ చేస్తారని తెలిపారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంఏ, బీఏ, బీఎస్సీ, ఐటీఐ, ఎంబీబీఎస్‌, బీటెక్‌, ఎంటెక్‌ తదితర కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు స్పష్టంచేశారు. 

తొలి విడత పంపిణీకి ₹2035 కోట్లు
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల పంపిణీపై యూపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార్‌ వినీత్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే 38లక్షల మందికి పైగా విద్యార్థులు డీజీ శక్తి పోర్టల్‌లో నమోదు చేయించుకున్నారని తెలిపారు. తదుపరి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల కోసం లావా, శామ్‌సంగ్‌, ఏసర్‌ కంపెనీలకు ప్రభుత్వం నుంచి ఆర్డర్లు చేశామని తెలిపారు. ఆయా కంపెనీలు డిసెంబర్‌ 24కు ముందే  సమకూరుస్తాయన్నారు. తొలి విడతలో పంపిణీ చేయబోయే పరికరాల కోసం రూ.2035 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. మొత్తంగా 10.50లక్షల స్మార్ట్‌ఫోన్లను ఒక్కోటి ₹10,740ల చొప్పున, అలాగే, 7.20లక్షల ట్యాబ్‌లను ₹12,606 చొప్పున కొనుగోలు చేసినట్టు వివరించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని