శ్రీరామనవమి సందడి షురూ..!

శ్రీరామనవమితో టాలీవుడ్‌ సినీ ప్రియులు కొంత ఉపశమనం పొందారు. కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న కారణంగా దాని కట్టడి చర్యల్లో భాగంగా 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో పలు చిత్రాల విడుదల వాయిదా..

Published : 02 Apr 2020 13:08 IST

సోషల్‌మీడియాలో పోస్టర్ల కళ

హైదరాబాద్‌: శ్రీరామనవమితో టాలీవుడ్‌ సినీ ప్రియులు కొంత ఉపశమనం పొందారు. కరోనా వైరస్‌ విస్తరిస్తోన్న కారణంగా దాని కట్టడి చర్యల్లో భాగంగా 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో పలు చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. దీంతో ఆయా పోస్టర్లకు లైకులు, కామెంట్లు, షేర్స్‌ చేస్తూ సినీ ప్రియులు కాస్త ఉపశమనం పొందుతున్నారు.

ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేయండి

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్‌’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్‌’ టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ తన భార్యాపిల్లలతో సరదాగా గడుపుతూ కనిపించారు. ‘ఇంట్లోనే ఉండండి. కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేయండి’ అని చిత్రబృందం పేర్కొంది.

ఆ మహమ్మారిని చంపాల్సిన సమయమిది

సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్రబృందం గురువారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘ప్రతి ఒక్కరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు. ఇంట్లోనే ఉండి ఆ మహమ్మారిని చంపాల్సిన సమయమిది’ అని చిత్రబృందం ట్వీట్‌ చేసింది.

ఇంట్లోనే ఉండండి..

సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఆర్కా మీడియా వర్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కేరాఫ్‌ కంచరపాలెం’ రూపకర్త వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో విభిన్న కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కొత్త పోస్టర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూ.. ‘ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా జీవించండి’ అని వారు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని