అక్కినేని కుటుంబానికి స్పెషల్‌ మే22

మే 22వ తేదీకీ తన కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. సరిగ్గా ఆరేళ్ల కిందట మే 22న ‘మనం’ చిత్రం

Updated : 24 May 2020 09:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మే 22వ తేదీకీ తన కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున అన్నారు. సరిగ్గా ఆరేళ్ల కిందట మే 22న ‘మనం’ చిత్రం ప్రివ్యూను తన కుమారులు నాగ చైతన్య, అఖిల్‌లతో కలిసి వీక్షించినట్లు చెప్పారు.

‘‘అందరం కలిసి మే 22న రాత్రి ఐమ్యాక్స్‌లో ‘మనం’ ప్రివ్యూ చూడటానికి వెళ్లాం. అప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ‘మీ తండ్రి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘సీతారామ జననం’ కోసం ఇదే మే 22న తొలిసారి ఘంటసాల బలరామయ్యగారి ఆఫీస్‌కు వెళ్లారు’ అని అన్నారు. అప్పుడే ఈ తేదీ ప్రత్యేకత గురించి నాకు తెలిసింది. ఆ మరుసటి రోజు (మే 23న) ‘మనం’ విడుదలై మంచి టాక్‌ అందుకుంది. అందరూ నాకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, నేను నటించిన తొలి చిత్రం ‘విక్రమ్‌’ విడుదలై 28ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు నాకు చెప్పడం మొదలు పెట్టారు. నేను నటించిన తొలి చిత్రం, నాన్నగారితో మా కుటుంబం మొత్తం కలిసి నటించిన ‘మనం’ ఒకే రోజు విడుదల కావడం ముందుగా ప్లాన్‌ చేసి అనుకున్నది కాదు. అలా జరిగిపోయింది’’

‘‘నేను నటించిన ‘అన్నమయ్య’ కూడా మే 22నే విడుదలై ఘన విజయం సాధించింది. అందుకే మే 22 ఉదయం నుంచే అందరూ ‘మనం’, ‘అన్నమయ్య’, ‘విక్రమ్’ గురించి నాకు ఫోన్లు చేస్తూ అభినందిస్తుంటారు. ఇలా ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘విక్రమ్’తో ప్రారంభమైన నా నటజీవితం 34 ఏళ్లు విజయవంతంగా పూర్తవడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అక్కినేని అభిమానులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని నాగార్జున చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని