‘ఏమాయ చేసావె’ టీం షార్ట్ ఫిల్మ్ చూశారా..?

కార్తీక్‌, జెస్సీ.. ఈ రెండు పేర్లు వినగానే సినీ ప్రేమికులకు గుర్తుకు వచ్చే సినిమా.. ‘ఏమాయ చేసావె’. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి ఎంతో మంది...

Updated : 21 May 2020 12:35 IST

‘నాకు నీ ప్రేమ కావాలి జెస్సీ’..!

జెస్సీకి కాల్‌ చేసిన కార్తీక్‌

చెన్నై: కార్తీక్‌, జెస్సీ.. ఈ రెండు పేర్లు వినగానే సినీ ప్రేమికులకు గుర్తుకు వచ్చే సినిమా.. ‘ఏమాయ చేసావె’. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారు. తెలుగులో నాగచైతన్య, సమంత నటించిన పాత్రలను తమిళంలో శింబు, త్రిష పోషించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు విభిన్నమైన అంశాలతో షార్ట్‌ ఫిల్మ్స్‌ను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గౌతమ్‌ మీనన్‌.. శింబు, త్రిషలతో ఓ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించారు. ఎవరి ఇళ్లలో వారు ఉండి దీనిని చిత్రీకరించారు. ‘కార్తీక్ డయల్ సేతా యెన్’ పేరుతో చిత్రీకరించిన ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో కార్తీక్‌.. జెస్సీకి ఫోన్‌ చేసి మాట్లాడతాడు.

 ఈ షార్ట్‌ఫిల్మ్‌లో జెస్సీ(త్రిష) భార్య పాత్రలో కనిపిస్తుంది. మరోవైపు కార్తీక్‌ (శింబు) లాక్‌డౌన్‌ కారణంగా సినీ పరిశ్రమలో ఎలాంటి పనులు లేకపోవడంతో నిరాశకు గురైన ఓ యువ దర్శకుడిగా దర్శనమిస్తారు. కథ రాయాలని భావించిన కార్తీక్‌కు జెస్సీ గుర్తుకువచ్చి.. వెంటనే ఆమెకు ఫోన్‌ చేసి.. ‘నువ్వు కేరళలో ఉన్నావని నాకు తెలుసు’ అని అంటాడు. ‘అవును.. నీకు ఎలా తెలుసు’ అని జెస్సీ ప్రశ్నిస్తుంది. ‘మాస్క్‌లు పంచుతూ ఇటీవల మీ సోదరి పెట్టిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో నిన్ను చూశాను’ అని చెబుతాడు. ఆ తర్వాత జెస్సీని.. భర్త, పిల్లలు, న్యూయార్క్‌ నుంచి ఇండియాకి రావడానికి గల కారణాలను కార్తీక్‌ అడిగి తెలుసుకుంటాడు. అనంతరం లాక్‌డౌన్‌ వల్ల సినీ పరిశ్రమలో తాను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో చెబుతూ భావోద్వేగానికి గురైన కార్తీక్‌.. ‘నాకు నువ్వు కావాలి జెస్సీ’, ‘నీ ప్రేమ నాకు కావాలి’ అని అంటాడు. కార్తీక్‌ బాధను అర్థం చేసుకున్న జెస్సీ.. ‘ఐ లవ్‌ యూ కార్తీక్‌.. నువ్వు నాకో బేబి. కానీ ఇది నువ్వు అనుకున్న ప్రేమ కాదు. నీలో గొప్ప రచయిత ఉన్నాడు. నీ టాలెంట్‌ని బయటపెట్టు. మంచి కథ రాయి. త్వరలోనే థియేటర్లు ఓపెన్‌ చేస్తారు. పరిస్థితులు చక్కబడతాయి’ అని ఓదారుస్తుంది. జెస్సీతో మాట్లాడిన తర్వాత సంతోషంగా ఫీలైన కార్తీక్‌.. తాను అనుకున్న కథను పూర్తి చేస్తాడు.

తాజాగా విడుదలైన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో కార్తీక్‌, జెస్సీ పాత్రల్లో శింబు, త్రిష మరోసారి మేజిక్‌ చేశారు. మధురమైన చిన్న ప్రేమకథతో గౌతమ్‌మీనన్‌ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం అలరిస్తుంది. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను చూసిన నెటిజన్లు.. ‘సూపర్‌గా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తోన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని