Kantara: తెలుగు ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదు..: రిషబ్‌ శెట్టి

‘కాంతార’ సక్సెస్‌ మీట్‌లో రిషబ్‌ శెట్టి మాట్లాడుతూ తెలుగు సినీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అందరి ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలానే కొనసాగలని కోరారు. 

Published : 30 Oct 2022 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తోన్న సినిమా కాంతార(Kantara). కన్నడ చిత్రమైనా అన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో అక్టోబర్‌ 15న విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా కాంతార చిత్రబృందం విశాఖపట్నం, తిరుపతిలో పర్యటించింది. ప్రేక్షకులతో సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంది. ఈ సందర్భంగా రిషబ్‌ శెట్టి(Rishab Shetty) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన రిషబ్‌ ‘‘సినిమాపై ఈ స్థాయిలో ప్రేమాభిమానాలు చూపినందుకు ధన్యవాదాలు. తెలుగు వాళ్లు ఈ సినిమాను ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదు. 2 వారాల్లో రూ. 45 కోట్ల వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా కూడా ఇలానే ఆదరిస్తున్నారు. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

ఇక అల్లు అరవింద్‌(Allu Aravind) మాట్లాడుతూ..‘సినిమాలకు భాషాభేదం ఉండదని, కథ బాగుంటే సినిమా హిట్‌ అవుతుందని ‘కాంతార’ మరోసారి నిరూపించింది. ఈ సినిమా చూడమని బన్నీవాసు నాతో చెప్పారు. ఎందుకు అంత ఆసక్తిగా చెబుతున్నారా అనుకున్నాను. కానీ, ఈ సినిమా మొదటిసారి చూసినప్పుడే ఇందులోని భావోద్వేగం నాకు అర్థమైంది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాను. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తెలుగులో విడుదల చేశాను’’ అని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని