Janhvi Kapoor: దక్షిణాది సినిమాలో జాన్వీ?... క్లారిటీ ఇచ్చిన బోనీ కపూర్‌!

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) తమిళంలో ఓ సినిమా చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. వీటిపై క్లారిటీ ఇస్తూ బోనీ కపూర్ (Boney Kapoor)‌ ట్వీట్‌ చేశారు.  

Published : 03 Feb 2023 23:19 IST

హైదరాబాద్‌: జాన్వీ కపూర్‌ (Jhanvi Kapoor) సౌత్‌ సినిమాల్లో నటించాలి అంటూ గత కొద్ది రోజులుగా అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు ఆమెకు సోషల్‌ మీడియాలో రిక్వెస్ట్‌లు కూడా పెడుతున్నారు. ఇదిగో, అదిగో అంటూ ఆమె చెబుతున్నా.. ఇంకా ఏదీ అనౌన్స్‌ చేయలేదు. ఈ క్రమంలో ఓ సౌత్‌ సినిమా (South Cinema)లో జాన్వీ నటిస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ‘అతిలోక సుందరి కూతురు సౌత్‌కి వస్తోంది’ అంటూ ఫ్యాన్స్‌ ఆనందపడిపోయారు. అయితే వారి ఆనందంపై బోనీ కపూర్‌ (Boney Kapoor) నీళ్లు చల్లారు.

శ్రీదేవి కూతురిగా వెండితెరకు పరిచమైంది జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకోడానికి కష్టపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల సర్వైవల్‌ డ్రామా ‘మిలీ’లో (Mili) కనిపించింది.  ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించనప్పటికీ... జాన్వీకి మాత్రం నటిగా మంచి మార్కులే పడ్డాయి. దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉందని, త్వరలోనే సౌత్‌ ఫిల్మ్స్‌లో కనిపించనున్నానని జాన్వీ చెప్పినప్పటి నుంచి ఆమె సినిమాలపై రూమర్స్‌ మొదలయ్యాయి.

జాన్వీ ఓ తమిళ సినిమా  చేస్తుందంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇవన్నీ రూమర్సంటూ కొట్టిపడేశారు జాన్వీ తండ్రి బోనీ కపూర్ (Boney Kapoor)‌. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘జాన్వీ ప్రస్తుతం ఎలాంటి తమిళ చిత్రాలు చేయడం లేదు. తన సినిమాలపై పుకార్లు సృష్టించొద్దు’’ అని ట్వీట్‌ లో పేర్కొన్నారు బోనీ. అయితే ఎన్టీఆర్‌ - కొరటాల శివ సినిమాలో జాన్వీ నటిస్తోందనే వార్తలు కూడా ఆ మధ్య వచ్చాయి. మరి ఆ సినిమా విషయంలోనూ క్లారిటీ వచ్చేస్తే బాగుండు అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. 

ఇక ప్రస్తుతం జాన్వీ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. వరుణ్‌ ధావణ్‌తో ‘బవాల్’‌ (Bawaal)లో నటిస్తోంది. నీతీష్‌ తివారీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్‌ రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ తొలిసారి ఓ బాలీవుడ్‌ సినిమాకు పూర్తిస్థాయి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటు జాన్వీ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr and Mrs Mahi) అనే సినిమాలోనూ నటిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని