‘ఇండియన్‌-2’ వాయిదా.. కారణం చెప్పిన కాజల్‌

విశ్వనటుడు కమల్‌హాసన్‌ - ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రానున్న భారీ ప్రాజెక్ట్‌ ‘భారతీయుడు-2’. సుమారు పాతికేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది.

Published : 18 Mar 2021 14:55 IST

చెన్నై‌: విశ్వనటుడు కమల్‌హాసన్‌ - ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రానున్న భారీ ప్రాజెక్ట్‌ ‘భారతీయుడు-2’. సుమారు పాతికేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. కాజల్‌ కథానాయిక. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ సినిమా షూట్‌ గతేడాది అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. ‘భారతీయుడు-2’ షూట్‌ అర్ధాంతరంగా నిలిచిపోవడానికి గల కారణాల గురించి అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్‌ అగర్వాల్‌.. షూట్‌ ఆగిపోవడానికి గల కారణాన్ని బయటపెట్టారు. చిత్రబృందంలో పనిచేసే ఎంతోమంది సభ్యులు అమెరికాకు చెందిన వారని.. కరోనా నిబంధనలతో వాళ్లు అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతున్నారని.. అందుకే షూట్‌ వాయిదా పడిందని ఆమె తెలిపారు. మరోవైపు ఈ సినిమా కోసం కాజల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నారు.

1996లో విడుదలైన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. లైకా ప్రొడెక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ సినిమా అనుకోని కారణాల వల్ల గతేడాది వాయిదా పడింది. సెట్‌లో ప్రమాదం చోటు చేసుకోవడంతో కొన్నిరోజులపాటు వాయిదా పడిన ఈ షూట్‌ కరోనా, లాక్‌డౌన్‌ అనంతరం కూడా పట్టాలెక్కలేదు. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనుకడుగు వేయడంతోనే షూట్‌ ఆగిపోతుందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టారు. ‘భారతీయుడు-2’ షూట్‌ నిలిచిపోవడంతో కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ ప్రాజెక్ట్‌ ఓకే చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని