Kaun Banega Crorepati 15: కౌన్‌ బనేగా కరోడ్‌పతి చివరి ఎపిసోడ్‌.. అమితాబ్‌ భావోద్వేగం

14 సీజన్‌లు పూర్తి చేసుకున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ఇప్పుడు 15వ సీజన్‌ను కూడా పూర్తి చేసుకుంది.

Published : 31 Dec 2023 01:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (Kaun Banega Crorepati) ఈ పేరు చెప్పగానే మన ముందు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) రూపమే కదలాడుతుంది. హాట్‌సీట్‌లో ఆయన్ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఇప్పటివరకూ 14 సీజన్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 15వ సీజన్‌ను కూడా పూర్తి చేసుకుంది. తాజాగా చివరి ఎపిసోడ్‌ ప్రసారమవగా షోకు వచ్చిన ప్రేక్షకులతో పాటు, బిగ్‌ బి భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యాబాలన్‌, షీలా దేవి, షర్మిలా ఠాగూర్‌, సారా అలీఖాన్‌ విచ్చేసి సందడి చేశారు. తమలో టాలెంట్‌ను అమితాబ్‌తో పంచుకోవడమే కాకుండా ప్రదర్శించారు.

ఈ క్రమంలో వేదికపై ప్రసారం చేసిన వీడియోను చూసి అమితాబ్‌ భావోద్వేగానికి గురయ్యారు. కేబీసీ ప్రారంభం నాటి నుంచి వివిధ సందర్భాలను కలిపి రూపొందించిన వీడియో ఆకట్టుకుంది. ‘మేము దేవుడిని చూడలేదు. కానీ, దేవుడి బిడ్డను చూశాం’ అంటూ అక్కడి ఆడియన్స్‌ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఈ రోజు గేమ్‌ చివరి ఎపిసోడ్‌. ఇక మళ్లీ ఇక్కడకు తిరిగి రాలేము. ఈ మాటలు చెబుతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటి రోజు వస్తుందని ఈ ప్రయాణం మొదలుపెట్టినప్పుడే నాకు తెలుసు. నా ప్రేక్షకులతో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నా’’ అని అమితాబ్‌ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని