Kriti Kharbanda: ‘తీన్‌మార్‌’ నటి నిశ్చితార్థం?.. ప్రియుడి ప్రపోజల్‌కు అమీ జాక్సన్‌ ఫిదా

‘తీన్‌మార్‌’ నటి కృతి కర్బంద, ‘ఫక్రీ’ ఫేమ్‌ పులకిత్‌ సామ్రాట్‌లకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వారికి నిశ్చితార్థం జరిగినట్లు బాలీవుడ్‌ మీడియాలో వార్తలొచ్చాయి.

Published : 30 Jan 2024 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బోణి’ చిత్రంతో తెరంగేట్రం చేసి ‘తీన్‌మార్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కృతి కర్బంద (Kriti Kharbanda). ఆమె.. బాలీవుడ్‌ నటుడు పులకిత్‌ సామ్రాట్ (Pulkit Samrat)తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. తాజాగా, వీరి నిశ్చితార్థం జరిగినట్లు బాలీవుడ్‌లో వార్తలొచ్చాయి. కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో వారు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని కథనాలు వెలువడ్డాయి. వీటిపై కృతి గానీ, పులకిత్‌ గానీ స్పందించలేదు. ఓ వేడుకకు హాజరైన ఈ జంట ఫొటోలకు పోజిచ్చింది. అందులో ఇరువురి చేతి వేళ్లకు ఒకే రకమైన ఉంగరాలు ఉండడంతో ఈ ఊహాగానాలు వచ్చాయి. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మరి, అది వారి నిశ్చితార్థ వేడుకా? వేరే ఫంక్షన్‌లో అలా సందడి చేశారా? తెలియాల్సి ఉంది. ‘బిట్టూ బాస్‌’, ‘సనమ్‌ రే’, ‘ఫక్రీ’ సిరీస్‌ చిత్రాలతో మెప్పించారు పులకిత్‌. 2015లో వచ్చిన ‘బ్రూస్‌ లీ’ తర్వాత కృతి తెలుగు సినిమాల్లో నటించలేదు. బాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. ‘పాగల్‌ పంతీ’, ‘తైశ్‌’ చిత్రాల ప్రయాణంలో పులకిత్‌, కృతిల మధ్య స్నేహం ఏర్పడి, అదికాస్తా ప్రేమగా మారింది.

అమీ జాక్సన్‌ ఇలా..

ప్రియుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ పెళ్లి ప్రపోజల్‌కు నటి అమీ జాక్సన్‌ (Amy Jackson) ఫిదా అయ్యారు. స్విట్జర్లాండ్‌లోని మౌంటెన్‌ బ్రిడ్జిపై.. సినిమాటిక్‌ స్టైల్‌లో మోకాలిపై కూర్చొని ఆయన ప్రపోజ్‌ చేశారు. ఆ ఫొటోను అమీ అభిమానులతో పంచుకున్నారు. గతంలో.. జార్జ్‌ పనయోటౌ అనే వ్యాపారవేత్తతో ఈ హీరోయిన్‌ సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో బాబుకు జన్మనిచ్చారు. వివాహం చేసుకోవాలని భావించారు గానీ చేసుకోలేదు. తర్వాత, బ్రిటిష్‌ నటుడైన ఎడ్‌తో అమీకి స్నేహం ఏర్పడింది. తమిళ సినిమా ‘మద్రాసపట్టణం’తో నటిగా మారిన ఆమె ‘ఎవడు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత, ‘ఐ’, ‘తేరి’, ‘2.ఒ’ తదితర చిత్రాలతో అలరించారు. విద్యుత్‌ జమ్వాల్‌ సరసన ఆమె నటించిన ‘క్రాక్‌’ ఫిబ్రవరి 23న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని