‘దృశ్యం2’ మరింత అలరిస్తుంది: మోహన్‌లాల్‌

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కథానాయకుడిగా 2013లో వచ్చిన చిత్రం ‘దృశ్యం’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను విశేషంగా

Published : 09 Feb 2021 11:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ కథానాయకుడిగా 2013లో వచ్చిన చిత్రం ‘దృశ్యం’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఆ చిత్రం. అంతేకాదు, తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్‌ అయి, ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం2’ వస్తోంది. జీతూ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓనమ్‌ సందర్భంగా ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ సందర్భంగా తాజా చిత్రం గురించి మోహన్‌లాల్‌, దర్శకుడు జీతూ జోసెఫ్‌ పలు విషయాలు పంచుకున్నారు.

నాకు నమ్మకం ఉంది: మోహన్‌లాల్‌

* ‘‘దృశ్యం’ మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం మలయాళంలోనే కాదు, ఇతర భాషల్లోనూ విశేష ఆదరణ సొంతం చేసుకుంది. చైనీస్‌లో రీమేక్‌ అయిన మొదటి భారతీయ చిత్రం. కమర్షియల్‌గా సక్సెస్‌ అవటమే కాకుండా మలయాళ చిత్రపరిశ్రమను ప్రపంచం చూసే దృష్టి కోణాన్ని మార్చింది’’

* ‘‘అలాంటి సినిమాకు సీక్వెల్‌ అంటే కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. అయినా సరే, ఇది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటుందన్న నమ్మకం నాకు ఉంది. అంతేకాదు, దీంతో మరో మైలురాయిని చేరుకుంటాం’’

పేరును చెడగొట్టదన్నారు: జీతూ జోసెఫ్‌

* ‘‘తొలి చిత్రం విడుదలైన తర్వాత స్పందన చూసి, చాలా మంది సీక్వెల్‌ చేయమని అడిగారు. సాధ్యమవుతుందా? కాదా? అన్నదానిపై చాలా తీవ్రంగా ఆలోచించా. అది కార్యరూపం దాల్చడానికి ఐదేళ్లు పట్టింది. నేను కథ రాయడం మొదలు పెట్టినప్పుడు ‘అలా చేయొద్దు. పేరు చెడగొట్టొద్దు’ అని నా కుటుంబ సభ్యులే అన్నారు’’

* ‘‘కథ సిద్ధం చేసిన తర్వాత.. తుది స్క్రిప్ట్‌ రెండూ వాళ్లకు చూపించా. ‘నిజంగా ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. తప్పకుండా తీయాలి’ అని అన్నారు. అలాగే మరికొందరు బయటకు వ్యక్తులకు కూడా కథ వినిపిస్తే చాలా బాగుందని చెప్పారు’’

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 19 అమెజాన్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మీనా, హసన్‌, ఎస్తర్‌ అనిల్‌, సిద్ధిఖీ, మురళీ గోపీ, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్‌ జాన్సన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని