మద్యం వల్లే బరువు పెరిగానని అనుకున్నారు..

కొన్నేళ్ల క్రితం తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని నటి నమిత తెలిపారు. ‘సొంతం’ అనే ప్రేమకథా చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనంతరం ‘జెమినీ’, ‘బిల్లా’ చిత్రాలతో తెలుగువారిని ఆకర్షించారు. కెరీర్‌లో ఆరంభంలో సన్నగా...

Updated : 14 Mar 2021 20:37 IST

సూసైడ్‌ ఆలోచనలు విపరీతంగా బాధించాయి

హైదరాబాద్‌: కొన్నేళ్ల క్రితం తాను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యానని నటి నమిత తెలిపారు. ‘సొంతం’ అనే ప్రేమకథా చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అనంతరం ‘జెమినీ’, ‘బిల్లా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించారు. కెరీర్‌లో ఆరంభంలో సన్నగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ‘బిల్లా’, ‘సింహా’ సినిమాల్లో బొద్దుగా కనిపించి అందర్నీ షాక్‌కు గురిచేశారు. కొంతకాలం క్రితం వివాహబంధంలోకి అడుగుపెట్టిన నమిత ఇప్పుడిప్పుడు పలు సినిమాల్లో అక్కడక్కడా తళుక్కున మెరుస్తున్నారు.

కాగా, తాజాగా నమిత.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ‘మానసిక ఒత్తిడిని ఎదుర్కొవడంపై అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పోస్ట్ పెడుతున్నాను. సుమారు తొమ్మిది, పదేళ్ల క్రితం నేను బొద్దుగా ఉండేదాన్ని. అప్పట్లో ఎంతో మానసిక కుంగుబాటుకు లోనయ్యాను. ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నాననే విషయం కూడా నాకు తెలియకపోవడం మరింత బాధాకరం. రాత్రిపూట నిద్రపోయేదాన్ని కాదు. ఆహారం ఎక్కువగా తీసుకోవడం అలవాటుగా మారింది. అనుకోకుండా విపరీతంగా బరువు పెరిగిపోయాను. అలా నా బరువు 97 కిలోలకు చేరింది. మద్యం తాగడం వల్లే నేను బరువు పెరిగానని అందరూ చెప్పుకున్నారు. థైరాయిడ్‌, పీసీఓడీ సమస్యల వల్లే లావుగా మారాననే విషయం నాకు మాత్రమే తెలుసు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు నన్ను మరెంతో బాధించాయి. దాదాపు ఐదేళ్లపాటు తీవ్రమైన కుంగుబాటు ఎదుర్కొన్న తర్వాత యోగాతో మనశ్శాంతి లభించింది. నాకు కావాల్సిన శాంతి మంత్రాన్ని నాలోనే కనుగొన్నాను. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మీరు దేని కోసమైతే బయట ప్రపంచంలో వెతుకుతున్నారో అది మీలోనే ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.’ అని నమిత వివరించారు.

ఇదీ చదవండి

జ్వరంతో ఉన్నా.. చిరు నాకోసం ఎదురుచూశారు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని