మేమిద్దరం కలిసే ఆడిషన్స్‌కు వెళ్లాం: నవీన్‌ పొలిశెట్టి

ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో తాను నటించాలనుకుంటున్నట్లు కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి తెలిపారు. యూట్యూబ్‌ స్టార్‌గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన నవీన్...

Published : 25 Mar 2021 16:10 IST

హైదరాబాద్‌: ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో తాను నటించాలనుకుంటున్నట్లు కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి తెలిపారు. యూట్యూబ్‌ స్టార్‌గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన నవీన్ ‘ఢి ఫర్ దోపిడి’, ‘1 నేనొక్కడినే’, ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’తో కథానాయకుడిగా మారిన నవీన్‌ ఇటీవల ‘జాతిరత్నాలు’తో రెండో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

‘‘నటుడిగా మారాలనుకున్నప్పుడు ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో పనిచేశా. వాళ్ల వీడియోలకు రచయితగా, నటుడిగా వర్క్‌ చేశా. పెళ్లి గురించి మేము చేసిన ఓ కామెడీ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. ప్రేక్షకులు కూడా కొత్తదనాన్ని ఇష్టపడతారని అర్థమైంది. సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కునే బదులు మన క్రియేటివిటి ఇక్కడే ఉపయోగించవచ్చు కదా అనిపించింది. వెంటనే వరుస వీడియోలు చేశాం. అన్ని హిట్ అయ్యాయి. దాంతో నాకు కొన్ని సినిమాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. చిన్న పాత్రలు అయినప్పటికీ నటించాను. అలాంటి సమయంలో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’ కథ నా వద్దకు వచ్చింది. వెంటనే ఓకే చేసేశాను’’

‘‘నా దృష్టిలో నటుడంటే అన్ని రకాల జోనర్లలో నటించగలగాలి. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి 200శాతం కృషి చేస్తా. బాక్సాఫీస్‌ వద్ద సినిమా హిట్‌ అవ్వాలని అనుకుంటాం. అలాగే, ఆ సినిమా గురించి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అందరూ చెప్పుకోవాలి. అలాంటి సినిమాల్లో నటించడానికి ప్రయత్నిస్తా. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని అనుకుంటున్నా’’

‘‘విజయ్ దేవరకొండ, నేనూ కెరీర్‌ను ఒకేసారి ప్రారంభించాం. మేమిద్దరం కలిసి ఆడిషన్స్ కూడా వెళ్లేవాళ్లం. కష్టపడితే తప్పకుండా మన కలలను సాకారం చేసుకోవచ్చు అనే దానికి మా ఇద్దరి ప్రయాణమే ఓ నిర్వచనం’’ అని నవీన్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని