Aravind: మమ్మల్ని చూసి ప్రేక్షకులు రారు.. హీరో హీరోయిన్లే ప్రచారం చేయాలి

ఓటీటీల్లో విస్తృతమైన కంటెంట్‌ ఉందని, ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావాలంటే నాయకానాయికలు ప్రచారంలో తప్పక పాల్గొనాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు.

Published : 04 Jun 2022 01:39 IST

హైదరాబాద్‌: ఓటీటీల్లో విస్తృతమైన కంటెంట్‌ ఉందని, ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావాలంటే నాయకా నాయికలు ప్రచారంలో తప్పక పాల్గొనాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. నిర్మాతలను చూసి ప్రేక్షకులు రారని, అందుకే తమ సినిమాలను ఆయా హీరోహీరోయిన్లు ప్రమోట్‌ చేసి, వారిని థియేటర్‌కు వచ్చేలా చేయాలన్నారు. ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial) సినిమా ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. సినిమాను ప్రమోట్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఇటీవల ఓ అగ్ర హీరో ఓ ఈవెంట్‌లో డ్యాన్స్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గోపీచంద్‌ వస్తేనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయమని చిత్ర బృందానికి సూచించినట్టు అరవింద్‌ తెలిపారు.

గోపీచంద్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథ వినగానే నాకు బాగా నచ్చేసింది. నేను గతంలో నటించిన ‘రణం’, ‘లౌక్యం’ వంటి సినిమాల్లో నటించిన వినోదాత్మక పాత్రను ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాలో పోషించా. నాన్‌స్టాప్‌ నవ్వులతో షూటింగ్‌ చేశాం. దర్శకుడు మారుతి నా నుంచి ఏదైతే ఆశించారో ఓ నటుడిగా దాన్ని అందించానని అనుకుంటున్నా. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో నటించేందుకు నాకు ఇన్నాళ్లకు అవకాశం లభించింది. రాశీఖన్నా చాలా బాగా నటించింది. టైటిల్‌కు తగ్గట్టు ఇది పక్కా కమర్షియల్‌ చిత్రం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మారుతి, హీరోయిన్‌ రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు. కోర్టు నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ కామెడీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థలు నిర్మించాయి. గోపీచంద్‌, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్న ఈ చిత్రం అల్లు అరవింద్‌ సమర్పణలో జులై 1న విడుదల కానుంది.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని