Pathaan: 32 ఏళ్ల తర్వాత అక్కడ హౌస్‌ఫుల్‌ బోర్డు.. ‘పఠాన్‌’ అరుదైన రికార్డు

బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ‘పఠాన్‌’ (Pathaan) చిత్రం అరుదైన రికార్డు సాధించింది. అదేంటంటే?

Published : 28 Jan 2023 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె నటించిన ‘పఠాన్‌’ (Pathaan) మరో అరుదైన ఘనత సాధించింది. కశ్మీర్‌ లోయలోని ఓ థియేటర్‌ బయట ఈ సినిమాకు హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టారట. అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా. కశ్మీర్‌లో ఓ థియేటర్‌లో ఇలా హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టి 32 ఏళ్లు అయ్యిందట. ఈ నెల 25న విడుదలైన ‘పఠాన్‌’ ప్రభంజనం ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. 

షారుఖ్‌ నుంచి నాలుగేళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ‘పఠాన్‌’ మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రేక్షకుల ఆదరణతో తొలి రెండు రోజుల్లోనే సుమారు రూ. 220 కోట్లు సాధించి, సరికొత్త రికార్డులు లిఖించడం విశేషం. ఇందులో భారత్‌ నుంచే సుమారు రూ.128 కోట్లు వచ్చాయని సమాచారం. ఇక కశ్మీర్‌ లోయలోని థియేటర్‌  సంగతి చూస్తే.. అక్కడి ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులతో నిండిపోయిందట. దీంతో బయట హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోను ఐనాక్స్‌ టీమ్‌ ట్వీట్‌ చేసింది. తొలిరోజున థియేటర్‌లోని అన్ని షోలూ హౌస్‌ఫుల్‌ అయ్యాయని ఐనాక్స్‌ ట్విటర్‌లో వెల్లడించింది.

కశ్మీర్‌లో ఉగ్రవాదుల బెదిరింపుల కారణంగా చాలా కాలంగా ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం లేదు. అయితే ఇటీవల భద్రతకు సంబంధించి పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీనికితోడు షారుక్‌ (Shah Rukh Khan) నాలుగేళ్ల తర్వాత నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకులకు థియేటర్లకు క్యూ కట్టారు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన థియేటర్లో..

లద్దాఖ్‌లోని లేహ్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన థియేటర్లోనూ ‘పఠాన్‌’ సందడి చేస్తోంది. పర్వత ప్రాంతాల్లోని ప్రజలకూ వినోదాన్ని అందించడానికి పిక్చర్‌టైమ్‌ డిజీప్లెక్స్‌ సంస్థ 2021లో అక్కడ మినీ థియేటర్‌ను ఏర్పాటు చేసింది. 11,562 అడుగుల ఎత్తులో ఉన్న ఈ థియేటర్‌కు తరలివస్తున్న ప్రేక్షకులు ‘పఠాన్‌’ను ఆస్వాదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని