perni nani: వాళ్లు కావాలంటే సినిమా వాయిదా వేసుకోవచ్చు: పేర్ని నాని

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ, థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని తీసుకున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని(Perni nani) స్పష్టం చేశారు.

Published : 11 Jan 2022 01:16 IST

అమరావతి: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ, థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ నిర్ణయాన్ని తీసుకున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని(Perni nani) స్పష్టం చేశారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు ప్రభుత్వ నిర్ణయం ఇబ్బందికరంగా ఉంటే వాయిదా వేసుకోవచ్చని సూచించారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టికెట్‌ ధరల తగ్గింపు విషయమై వర్మలా ఎవరైనా వచ్చి తమతో మాట్లాడవచ్చని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.

‘‘వ్యక్తుల అభిప్రాయాలను సంతృప్తిపరచటం కష్టం సాధ్యం. సహజంగా మేము కూడాకొన్ని లాజిక్‌లు చెబితే ఎదుటి వారికి కష్టం కలుగుతుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. సినిమాటోగ్రఫ్రీ నిబంధనల మేరకే రేటు నిర్ణయించాం. 2013లో జారీ చేసిన జీవో నెం.100తో పోలిస్తే ధరలు పెంచే ఇచ్చాం. ఒకవేళ ఈ ధరలు ఎవరికైనా సహేతుకంగా లేవని అనిపిస్తే నేరుగా వచ్చి, కమిటీకి చెప్పొచ్చు. మేం చట్ట వ్యతిరేక కార్యక్రమం చేయలేదు. టికెట్‌ ధరలపై కమిటీ మరోసారి సమావేశం అవుతుంది. వర్మగారు ఇచ్చినట్లే ఎవరు సలహాలు ఇచ్చిన తీసుకుంటాం. ఒకవేళ నాకు సలహా ఇవ్వటం ఇబ్బంది అనుకుంటే నేరుగా కమిటీతో మాట్లాడుకోవచ్చు. కమిటీకీ నాకు ఎలాంటి సంబంధం లేదు. హోం సెక్రటరీతో కలిసి వాళ్లు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కొవిడ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న కారణంగానే థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించాం. ప్రభుత్వం నిర్ణయం ఇబ్బంది ఉంటే సినిమాను వాయిదా వేసుకోవచ్చు. కొవిడ్‌ కారణంగానే కదా.. ‘ఆర్ఆర్ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ వాయిదా వేసుకున్నారు. కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి సీఎంగారు ఛైర్మన్‌. ఏపీతో పాటు, పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేసి, ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు’’ అని పేర్ని నాని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని