Salman khan: సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు ఈ- మెయిల్.. భద్రత మరింత పెంపు!

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు.. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు.. సల్మాన్‌ ఇంటి వద్ద భద్రతను పెంచారు.

Published : 20 Mar 2023 21:34 IST

ముంబయి: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman khan)కు.. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌(Lawrence Bishnoi) గ్యాంగ్‌ నుంచి ఈ- మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ముంబయి పోలీసు (Mumbai Police)లు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే సల్మాన్‌ ఇంటి వద్ద భద్రతను పెంచారు. ఇద్దరు ఎస్సై స్థాయి అధికారులు, దాదాపు 10 మంది కానిస్టేబుళ్లు.. రేయింబవళ్లు భద్రతా విధుల్లో ఉంటారని ఓ అధికారి వెల్లడించారు. బాంద్రా (Bandra) శివారులోని సల్మాన్‌ నివాసం, ఆఫీస్‌ వెలుపల అభిమానులకు గుమిగూడే అనుమతి లేదని చెప్పారు.

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి సల్మాన్‌ ప్రాణాలకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో గతేడాది నవంబరులో మహారాష్ట్ర ప్రభుత్వం.. ముంబయి పోలీసులతో అప్పటికే ఉన్న ఎక్స్‌ గ్రేడ్‌ భద్రతను ‘వై ప్లస్‌’గా అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డ్‌లు సల్మాన్‌కు నిత్యం భద్రతగా ఉంటున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రతిరోజూ పహారా కాస్తున్నారు. బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనం సమకూర్చారు. తాజాగా అదనపు సిబ్బందితో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.

తాజా బెదిరింపు వ్యవహారంలో సల్మాన్‌ టీమ్‌ ఫిర్యాదుతో.. లారెన్స్‌ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌తోపాటు ఈ- మెయిల్‌ పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహిత్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. గ్యాంగ్‌స్టర్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా సల్మాన్‌ఖాన్‌ బిష్ణోయ్‌ల మనోభావాలను దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్‌ నిర్దోషిగా విడుదలయ్యారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన బిష్ణోయ్‌.. ప్రస్తుతం దిల్లీ జైలులో ఉన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని