Salmankhan: బుల్‌ షూటింగ్‌ త్వరలో?

‘టైగర్‌ 3’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారాయన.

Updated : 02 Dec 2023 09:47 IST

‘టైగర్‌ 3’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చారు బాలీవుడ్‌ కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారాయన. ఇటీవలే ఆయన ‘బుల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. విష్ణువర్ధన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు సమాచారం. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. 2025 ఈద్‌కి ఈ సినిమా విడుదల కానుంద’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందులో పారా మిలటరీ అధికారిగా కనిపించనున్నారు సల్మాన్‌.


అజయ్‌ దేవగణ్‌ సైతాన్‌

వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన ఓ రీమేక్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆర్‌.మాధవన్‌, జ్యోతిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పేరు ‘సైతాన్‌’ అని ప్రకటించింది చిత్రబృందం. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. గుజరాతీలో మంచి విజయాన్ని అందుకున్న ‘వశ్‌’ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం ‘సింగమ్‌ అగైన్‌’ చిత్రీకరణలో ఉన్నారు అజయ్‌ దేవగణ్‌.


‘రత్నం’గా విశాల్‌

ఆగ్రహమే అరుణధారగా... రణరంగమే రక్తపుటేరుగా... అంటూ తన కొత్త చిత్రం ‘రత్నం’ సినిమాని ప్రకటించారు విశాల్‌. ఆయన కథానాయకుడిగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రియ భవానీ శంకర్‌ కథానాయిక. జీ స్టూడియోస్‌తో కలిసి  కార్తికేయన్‌ సంతానం నిర్మిస్తున్నారు. విశాల్‌కి ఇది 34వ చిత్రం. హరి దర్శకత్వంలో ఆయన చేస్తున్న మూడో చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. విశాల్‌ సినిమాకి దేవిశ్రీ సంగీతం అందిస్తుండడం ఇదే తొలిసారి. రత్నం  ఫస్ట్‌ షాట్‌ పేరుతో ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసి  శుక్రవారం సినిమాని అధికారికంగా ప్రకటించారు. యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న చిత్రమని వీడియో స్పష్టం చేస్తోంది.  వేసవి సందర్భంగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని