Sharukh - Pathaan: ఓటీటీలో షారుఖ్‌ ‘పఠాన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

pathaan ott: షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్‌’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు  సిద్ధమైంది!

Updated : 21 Mar 2023 11:48 IST

హైదరాబాద్‌: షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan) కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘పఠాన్‌’ (pathaan). దీపిక పదుకొణె కథానాయిక. జాన్‌ అబ్రహాం ప్రతినాయకుడిగా నటించారు. బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మార్చి 22వ నుంచి హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రాజమౌళి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి2’ (baahubali 2 the conclusion) పేరిట ఉన్న రికార్డును ‘పఠాన్‌’ బద్దలు కొట్టింది. అంతేకాదు, అత్యధిక వసూళ్ల రాబట్టిన హిందీ చిత్రంగా టాప్‌-1లో నిలిచింది. ఇప్పటి వరకూ ఈ సినిమా రూ.1048.30 కోట్లు వసూలు చేసింది. భారతీయ బాక్సాఫీస్‌ వద్ద రూ.656 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.392.10కోట్లు వసూలు చేసింది.

క‌థేంటంటే: ప‌ఠాన్ (షారుఖ్‌ ఖాన్‌) (Shah Rukh Khan) గుండెల నిండా దేశ‌భ‌క్తి ఉన్న రా ఏజెంట్.  ఓ సంఘ‌ట‌న త‌ర్వాత అజ్ఞాతంలో ఉంటాడు. భార‌త‌దేశం ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేశాక దేశంపై దాడికి వ్యూహం ప‌న్నుతాడు పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికారి. అందుకోసం ప్రైవేట్ ఏజెన్సీ ఔట్‌ఫిట్ ఎక్స్ చీఫ్ జిమ్ (జాన్‌ అబ్రహం) (John Abraham)ని రంగంలోకి దింపుతాడు. జిమ్ కూడా ఒక‌ప్పుడు భార‌త‌దేశం త‌ర‌ఫున ఏజెంట్‌గా ప‌నిచేసిన‌వాడే. మ‌రి ఎందుకు శ‌త్రువుల‌తో దోస్తీ చేశాడు? భార‌త్‌పై వైర‌స్ దాడికి సిద్ధమైన జిమ్‌ని ప‌ఠాన్ ఎలా ఎదుర్కొన్నాడు? వీరిద్దరి మ‌ధ్యకు పాకిస్థాన్ ఐ.ఎస్‌.ఐ ఏజెంట్ రూబై (దీపికా ప‌దుకొణె) (Deepika Padukone) ఎలా వ‌చ్చింది? ఆమె క‌థేమిటి? ఆమె ఎవ‌రికి, ఎలా సాయం చేసిందనేది మిగ‌తా క‌థ‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని