MAA Election: సంక్షేమం కోసమే.. నిర్మాణానికి కాదు..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో లెక్కలు చెప్పాలంటే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల నటుడు నాగబాబు స్పందించారు. ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని..

Published : 18 Jul 2021 01:26 IST

బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఏమన్నారంటే

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో లెక్కలు చెప్పాలంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పట్ల నటుడు నాగబాబు స్పందించారు. సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని.. భవనం నిర్మించడానికి కాదని ఆయన తెలిపారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

‘‘‘మా’ ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు. ‘మా’కు శాశ్వత భవనం ఏర్పాటు చేయడం కోసం ఒకప్పటి అధ్యక్షుడు మురళీమోహన్‌ ఎంతో ప్రయత్నించారు. కాకపోతే పలు రాజకీయ కారణాల వల్ల అది సఫలం కాలేదు. ఆయన తర్వాత వచ్చినవాళ్లు కూడా ఎన్నో సార్లు ‘మా’కు శాశ్వత భవనం నిర్మించాలనుకున్నారు. సభ్యుల సంక్షేమం, ఇతర కారణాలపై దృష్టి సారించడంతో.. ఇప్పటికీ అది వీలు కాలేదు. ‘మా’ అసోసియేషన్‌ అభివృద్ధి, నటీనటులందర్నీ ఒకే తాటిపైకి తీసుకురావడం, భవన నిర్మాణం, నిర్మాణానికి కావాల్సిన భూమి విషయంలో ప్రకాశ్‌రాజ్‌కి ఒక విజన్‌ ఉంది. ‘మా’ అసోసియేషన్‌ వృద్ధికోసం ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేదానిపై ఆయనకు ఉన్న ప్లానింగ్‌ నాకు బాగా నచ్చింది. అందుకే నేను ఆయనకు సపోర్ట్‌ చేస్తున్నాను’’

‘‘మా’ కోసం ఇప్పటివరకూ కొంతమంది అధ్యక్షులు విరాళాలు సేకరించిన మాట వాస్తవమే కానీ.. నాకు తెలిసినంత వరకూ అవి ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం సేకరించారు. భవనం నిర్మించడానికి కాదు. అలాగే ఇటీవల ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేయాలంటూ విష్ణు వ్యాఖ్యానించారు. అయితే, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఏకగ్రీవం చేయాలనుకుంటే.. పోటీలో నిలబడిన వాళ్లందరూ తప్పుకుని ప్రకాశ్‌రాజ్‌ని అధ్యక్షుడిని చేయవచ్చు కదా! నా దృష్టిలో ఏకగ్రీవం చేయాలనుకోవడం మంచి పద్ధతి కాదు. ఏ అంశంలోనైనా పోటీ ఉండాలి.. కానీ అది ఆరోగ్యకరమైన పోటీ అయి ఉండాలి. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా సరే అందరూ కలిసి పనిచేస్తే... మరింత అభివృద్ధి సాధించవచ్చు’ అని నాగబాబు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని