OTT: ఇప్పటి వరకు వారు.. ఇకపై వీరూ.. ఓటీటీ బాటలో స్టార్లు!

ఓటీటీ.. ప్రస్తుతం చాలామంది జీవితాల్లో భాగమైంది. కొత్త సినిమాలు చూడాలన్నా.. ధారావాహికలు వీక్షించాలన్నా కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు విభిన్నమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నాయి.

Published : 21 Jun 2022 10:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీ (OTT).. ప్రస్తుతం చాలామంది జీవితాల్లో భాగమైంది. కొత్త సినిమాలు చూడాలన్నా.. ధారావాహికలు వీక్షించాలన్నా కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆయా సంస్థలు విభిన్నమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రూపొందుతున్నవే వెబ్‌ సిరీస్‌లు (Web Series). వీటిల్లో నటించేందుకు వర్ధమాన నటులే కాదు పేరున్న స్టార్లూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది తారలు వెబ్‌ సిరీస్‌ల్లో మెరవగా త్వరలో సందడి చేయబోయే మరికొందరి వివరాలు చూద్దాం..

మల్టీస్టారర్‌ సిరీస్‌

నటుడిగా సుదీర్ఘ అనుభవమున్న వెంకటేశ్‌ (Venkatesh) ఓటీటీ ఎంట్రీ ఖరారు చేయడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తన సోదరుడి తనయుడు, నటుడు రానా (Rana Daggubati)తో కలిసి తాను నటిస్తున్నానని చెప్పడం అంతకుమించి అంచనాలు పెంచింది. ఈ ఇద్దరు కలిసి నటించిన సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). కరణ్‌ అన్షుమాన్‌, సుపర్ణ్‌ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘రే డొనోవన్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. క్రైమ్‌ డ్రామా కథాంశంతో రాబోతున్న ఈ ప్రాజెక్టులో సుర్వీన్‌ చావ్లా, సుశాంత్‌ సింగ్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌ త్వరలోనే ‘నెట్‌ఫ్లిక్స్‌’లో (Netflix) విడుదలకానుంది. రానా హీరోగా తెరకెక్కిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాలో వెంకటేశ్‌ ఓ ప్రత్యేకగీతంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌ను పూర్తిస్థాయిలో ‘రానా నాయుడు’లో చూడొచ్చు.


భయపెట్టే ధూత

అక్కినేని వారసుడిగా తెరపైకి వచ్చి, విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు నాగచైతన్య (Naga Chaitanya). ఈయన ‘ధూత’ (Dootha) అనే సిరీస్‌తో ఓటీటీ బాటపట్టారు. హారర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాభవానీ శంకర్‌ కథానాయిక. ఈ సిరీస్‌లో చైతన్య చాలా కొత్తగా కనిపించనున్నారు. ఈ సిరీస్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో (Amazon Prime Video) స్ట్రీమింగ్‌కానుంది. విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. అక్కినేని ఫ్యామిలీతో విక్రమ్‌ కె. కుమార్‌ గతంలో ‘మనం’ చిత్రం తెరకెక్కించి, మంచి విజయం అందుకున్నారు. మరోవైపు, నాగచైతన్య హీరోగా విక్రమ్‌ రూపొందించిన ‘థ్యాంక్‌ యూ’ (Thank You) సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకురానుంది.


నీళ్ల ట్యాంక్‌తో సుశాంత్‌

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్‌ (Sushanth) ఒకరు. ‘కాళిదాసు’తో నటుడిగా మారిన ఈయన ‘కరెంట్‌’, ‘అడ్డా’, ‘,చి.ల.సౌ’, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మా నీళ్ల ట్యాంక్‌’ (Maa Neella Tank) అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్టు ఆయన ఇటీవల ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో కామెడీ ప్రధానంగా రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ‘జీ 5’లో (Zee 5) ఈ సిరీస్‌ విడుదలకానుంది.


పెళ్లితో రాజ్‌తరుణ్‌ సందడి

‘ఉయ్యాల జంపాలా’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun). ‘సినిమా చూపిస్త మామ’, ‘కుమారి 21 F’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘రంగుల రాట్నం’, ‘లవర్‌’, ‘ఒరేయ్‌ బుజ్జిగా’ తదితర సినిమాలతో యువతో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న తరుణ్‌ ‘అహ నా పెళ్లంట’ (Aha Naa Pellanta) అనే వెబ్‌ సిరీస్‌తో త్వరలో సందడి చేయబోతున్నారు. తాళి కట్టే సమయానికి పెళ్లి కూతురు తన ప్రియుడితో వెళ్లిపోతే ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరిపై ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ‘ఏబీసీడీ’ సినిమా ఫేం సంజీవ్‌ రెడ్డి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ వినోదాత్మక ప్రాజెక్టు ‘జీ 5’లో విడుదలకానుంది. వీరితోపాటు మరికొందరు స్టార్లు ఓటీటీ వేదికగానూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.


ఆది- లావణ్య జంటగా..

జయపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటుడు ఆది సాయికుమార్‌. ప్రస్తుతం ఆయన చేతిలో ‘తీస్‌మార్‌ ఖాన్‌’, ‘జంగిల్‌’, ‘కిరాతక’, ‘అమరన్’, ‘క్రేజీ ఫెలో’ తదితర చిత్రాలున్నాయి. వీటితోపాటు ‘పులి- మేక’ అనే వెబ్‌ సిరీస్‌ను పట్టాలెక్కించారు. ఇందులో ఆదికి జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. దర్శకులు అనిల్‌ రావిపూడి, బాబీ, రచయిత కోన వెంకట్‌ ముఖ్య అతిథులుగా ఈ సిరీస్‌ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ ప్రాజెక్టు ‘జీ 5’లో స్ట్రీమింగ్‌ కానుంది.


ఓటీటీలోకి అడుగుపెట్టిన వారు..

‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’తో (The Family Man) సమంత, ‘లైవ్‌ టెలికాస్ట్‌’తో కాజల్‌ అగర్వాల్‌, ‘నవంబరు స్టోరీ’తో తమన్నా, ‘పిట్ట కథలు’తో శ్రుతిహాసన్‌, ఈషా రెబ్బా, ‘కుడి ఎడమైతే’తో అమలాపాల్‌, ‘చదరంగం’తో శ్రీకాంత్‌, ‘గ్యాంగ్‌స్టర్స్‌’తో జగపతిబాబు,  ‘నవరస’తో సూర్య, విజయ్‌ సేతుపతి, సిద్ధార్థ్‌, అరవింద్‌ స్వామి తదితరులు ప్రేక్షకుల్ని ఇప్పటికే మెప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని