విజయ్‌వర్మలా ఉండాలనుకుంటున్నా: నాగార్జున

చేసిన పని, చేసిన సినిమాలే చేయడం ఇష్టం లేదని నాగార్జున అన్నారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో నాగార్జున ప్రధానపాత్రలో ‘వైల్డ్‌ డాగ్‌’ తెరకెక్కిన విషయం తెలిసిందే. సయామీఖేర్‌, అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Published : 28 Mar 2021 22:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘వైల్డ్‌డాగ్‌’ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం విజయ్‌వర్మ పాత్ర. బయట కూడా అలాగే ఉండాలనుకుంటున్నా’’ అన్నారు నాగార్జున. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ఆయన ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. సయామీఖేర్‌, అలీ రెజా, ఆర్యా పండిట్‌, కాలెబ్‌ మాథ్యూస్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ముందుగా నేషనల్‌ అవార్డు సాధించిన వంశీపైడిపల్లి, రాజు సుందరం, గౌతమ్‌, నవీన్‌కు అభినందనలు. మేమంతా గర్వపడేలా చేశారు. ఇక ‘వైల్డ్‌డాగ్‌’ గురించి చెప్పాలంటే.. డైరెక్టర్‌ అహిషోర్‌ సాల్మన్‌ చెప్పిన కథ నాకు నచ్చడానికి కారణం విజయ్‌వర్మ పాత్ర. అతను ప్రేమించిన దానికోసం ఏదైనా చేస్తాడు. అందుకే అమితంగా ప్రేమించే భారతదేశం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడతాడు. నాకు నిజ జీవితంలో కూడా ఆ పాత్రను అనుసరించాలని ఉంది. నేను తీసే సినిమాలు అలాగే ఉండాలని నా కోరిక. అందుకే నేను చేసే సినిమాలన్నీ ప్రయోగాత్మకంగా ఉంటాయి. చేసిన పనే చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే చేసిన సినిమాలు మళ్లీ చేయడానికి ఇష్టపడను. ఈ సినిమా చేయడానికి కారణం కూడా అదే’’ అని ఆయన అన్నారు.

‘‘ఇక ఈ సినిమాలో అసలైన ‘వైల్డ్‌డాగ్‌’ నిర్మాత నిరంజన్‌రెడ్డి. డైరెక్టర్‌ సాల్మన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరం కలిసి ‘ఊపిరి’కి పనిచేశాం. ఆయనకు ఏదైనా తెలియకపోతే మొహమాటపడకుండా టెక్నీషియన్లను అడుగుతారు. ఈ సినిమాలో ఇంకో చిన్న వైల్డ్‌డాగ్‌ సినిమాటోగ్రాఫర్‌ షానైల్ డియో. సినిమాను చాలా ప్రేమతో తీశాం. ఇక ‘ఊపిరి’తో తమ్ముడైన కార్తీ సినిమా కూడా విడుదల కాబోతోంది. మా ఇద్దరి సినిమాలు ఒకేరోజు మీ ముందుకు వస్తున్నాయి. ఆ సినిమా కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏప్రిల్‌ 2న అందరూ థియేటర్లకు వెళ్లి ‘వైల్డ్‌డాగ్‌’ సినిమా చూస్తారని ఆశిస్తున్నా’’ అని నాగార్జున అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని