తానా ‘ప్రపంచ రంగస్థల దినోత్సవం’ విజయవంతం

మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ‘పద్యనాటక సాహితీ వైభవం- రంగస్థల కళాకారుల గాన మాధుర్యం’ అనే అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ఆసక్తిగా సాగింది. 

Updated : 01 Apr 2022 02:26 IST

ఆసక్తిగా సాగిన ‘పద్యనాటక సాహితీ వైభవం-రంగస్థల కళాకారుల గాన మాధుర్యం’

అట్లాంటా, జార్జియా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ‘పద్యనాటక సాహితీ వైభవం- రంగస్థల కళాకారుల గాన మాధుర్యం’ అనే అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం ఆసక్తిగా సాగింది. 

తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. మన తెలుగు భాష, సాహిత్యం, కళలను పరిరక్షిస్తూ, పరివ్యాప్తం చేయడానికి దశాబ్దాల చరిత్ర కలిగిన తానా సంస్థ ఎల్లప్పుడూ కంకణబద్ధమై ఉందన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న కళాకారులందరికీ హార్థిక స్వాగతం పలికారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎంతో వైభవంగా విరాజిల్లిన మన రంగస్థల వేదికలు మసకబారుతున్న వేళ తానా ప్రపంచ సాహిత్య వేదిక సారథ్యంలో అంతర్జాతీయ అంతర్జాల సమావేశం జరుపుకోవడం ముదావహమన్నారు. ఇది కళాకారులకు ఎంతో ప్రోత్సాహం కల్గిస్తుందన్నారు. 

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఎన్నో దశాబ్దాల క్రితమే ఆనాటి సామాజిక రుగ్మతలను, దురాచారాలను ఎండగడుతూ సామాజిక శ్రేయస్సును కాంక్షించి విలువైన సాహిత్యాన్ని సృష్టించిన రచయితలను గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది అన్నారు. అలాంటి రచయితలలో ముందు వరసలో ఉండే “చింతామణి” లాంటి అనేక నాటకాలు రాసిన ప్రముఖ నాటకకర్త కాళ్లకూరి నారాయణరావు, ‘శ్రీకృష్ణ తులాభారం’ పద్యనాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు, ‘పాండవోద్యోగ విజయాలు’ లాంటి వందలాది సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకాలు రచించిన అవధాన జంట కవులు తిరుపతి వేంకట కవులు అని పేర్కొన్నారు. ‘సత్యహరిశ్చంద్ర’ నాటక రచయిత, ఎన్నో సినిమాలకు కథ, మాటలు, పాటలు రాయడమేగాక పలు సినిమాలలో నటించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, ‘గయోపాఖ్యానము’ లాంటి గొప్ప నాటకాన్ని రచించిన కవి, నాటకకర్త, సంఘసంస్కర్త, పాత్రికేయుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం లాంటి మహనీయుల జీవనయానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి కళాకారుడు ఆయా నాటక ప్రదర్శనల ముందు ఆయా రచయితలను గుర్తు చేసుకుని నాటకాన్ని ప్రారంభించే సంప్రదాయం నెలకొల్పడం అవసరం అని, అదే ఆ రచయితలకర్పించే ఘన నివాళి అని అన్నారు. 

గౌరవ అతిథిగా హాజరైన విశేషానుభవం గడించిన కళాకారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఎన్టీఆర్‌ పురస్కార గ్రహీత గరికపాటి సుబ్బ నరసింహ శాస్త్రి మాట్లాడుతూ.. మాధవపెద్ది వెంకట్రామయ్య, బందా కనకలింగేశ్వర రావు, అద్దంకి శ్రీరామమూర్తి, పీసపాటి నరసింహ శాస్త్రి లాంటి విశిష్ఠ రంగస్థల కళాకారుల సరసన నటించగలగడం తన అదృష్టమన్నారు. 88 ఏళ్ల వయస్సులో కూడా ఆయన పదును తగ్గని వాచకం, ఉత్సాహంతో పలు పౌరాణిక పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని గావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట రంగస్థల కళాకారులు పాల్గొని కొన్ని నాటకాలలోని పద్యాలను మధురంగా ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగునాట విశేష ఆదరణ పొందిన నాటక సన్నివేశాలు గానం చేసిన విశిష్ట రంగస్థల కళాకారుల గురించి తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి    మాట్లాడారు. వీరిలో పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్ల గోపాలరావు(శ్రీకాకుళం) ‘హరిశ్చంద్ర నక్షత్రకుడు’, గుమ్మడి గోపాలకృష్ణ (హైదరాబాద్) ‘చెల్లియో చెల్లకో’, ‘జెండాపై కపిరాజు’, జూనియర్ దుబ్బు వెంకట సుబ్బారావు (వేటపాలెం) ‘హరిశ్చంద్ర కాటిసీను’, చిలువేరు శాంతయ్య (మధిర) ‘చింతామణిలో భవానీ శంకరుడు’, గంటి రత్నశ్రీ (కడప) ‘చింతామణిలో చింతామణి’ షణ్ముఖి జయవిజయకుమార్ రాజు (తణుకు) ‘శ్రీకృష్ణ తులాభారంలో నారదుడు’, బడే శ్రీరాములు నాయుడు (పార్వతీపురం) ‘గయోపాఖ్యానములో  అర్జునుడు’; కొప్పర మంగాదేవి (పార్వతీపురం) ‘హరిశ్చంద్రలో వారణాసి’, పలగాని ఫణి శంకర్ గౌడ్ (విజయవాడ) ‘చింతామణి– బిల్వమంగళుడు’; తెలుగు కృష్ణ (మహబూబ్ నగర్) ‘శ్రీకృష్ణ రాయబారం– పడకసీను’, కోట వనజ కుమారి (అనంతపురం) ‘శ్రీ కృష్ణ తులాభారం – సత్యభామ’, ఆరాథ్యుల నాగరాజు (తెనాలి) ‘గయోపాఖ్యానము – శ్రీకృష్ణుడు’; నిమ్మగడ్డ సుగ్రీవుడు (నెల్లూరు) ‘శ్రీరామాంజనేయ యుద్ధం- శ్రీ రాముడు’ ఉన్నారు. 

డా.ప్రసాద్ తోటకూర తన సమాపనా సందేశంలో పాల్గొన్న కళాకారులకు, కార్యక్రమాలను సదా ప్రచారం చేస్తున్న ప్రసార మాధ్యమాలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటక ప్రదర్శనను నిషేధించడం సబబుకాదన్నారు. దానివల్ల ఎంతోమంది కళాకారులు తమ జీవనభృతిని కోల్పోతున్నారని, ప్రభుత్వం నిషేధంపై పునరాలోచించాలని అలాగే అసభ్యతకు తావులేని, కలుషితంగాని ప్రదర్శనలు ఇవ్వవలసిన భాద్యత కళాకారులపై ఉందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని