పదేళ్ల నుంచి బెయిల్‌పై ఉన్న నాయకుడు జగనే: గంటా

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Published : 24 Sep 2023 05:41 IST

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం విశాఖ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాజకీయ నాయకునిపై లేనన్ని కేసులు జగన్‌పై ఉన్నాయని, పదేళ్ల నుంచి బెయిలుపై ఉన్నారని గుర్తు చేశారు. ఆర్థిక నేరాల కింద జగన్‌ను పలుసార్లు విచారించిన తర్వాతే సీబీఐ అరెస్టు చేసిందని అన్నారు. చంద్రబాబు విషయంలో కనీసం నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఇటీవల సీఓటరు సంస్థ సర్వేలో సైతం చంద్రబాబు అరెస్టు అక్రమేనని అధికశాతం ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు నీతి ఆయోగ్‌ సైతం కితాబు ఇచ్చిందన్నారు. ఏయూలో ఉన్న కేంద్రాన్ని అప్పటి పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి సందర్శించి మెచ్చుకున్నారని, వైకాపా ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు ఇచ్చిందని వివరించారు. తండ్రి కోసం దిల్లీ వెళ్లి న్యాయవాదులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులతో లోకేశ్‌ సంప్రదింపులు జరుపుతుంటే భయపడి పారిపోయినట్లు విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో తెదేపా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని