వ్యర్థం నుంచి అర్థం
రోజూ ఎడాపెడా రకరకాల వస్తువులు వాడేస్తుంటాం. బోలెడన్ని పదార్థాలు తింటుంటాం. కానీ ఎప్పుడైనా చెత్త గురించి ఆలోచించారా? మిగిలిపోయే ఆహారం, పాడైపోయిన వస్తువులు, ప్యాకెట్లు.. ఒకటేమిటి? అన్నీ చెత్తను సృష్టించేవే. ఇదిప్పుడు ప్రపంచానికే సవాల్ విసురుతోంది.
రోజూ ఎడాపెడా రకరకాల వస్తువులు వాడేస్తుంటాం. బోలెడన్ని పదార్థాలు తింటుంటాం. కానీ ఎప్పుడైనా చెత్త గురించి ఆలోచించారా? మిగిలిపోయే ఆహారం, పాడైపోయిన వస్తువులు, ప్యాకెట్లు.. ఒకటేమిటి? అన్నీ చెత్తను సృష్టించేవే. ఇదిప్పుడు ప్రపంచానికే సవాల్ విసురుతోంది. వ్యర్థాలను శుద్ధి చేసి పునర్వినియోగించుకోవటం ద్వారా దీన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. కానీ ఇదంత గొప్పగా ఏమీ సాగటం లేదు. అందుకే వ్యర్థాలను ఇంధనాలు, సుస్థిర పదార్థాలుగా మార్చుకోవటంపై శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు దృష్టి సారిస్తున్నారు. వినూత్న పద్ధతులను రూపొందిస్తున్నారు. ఒకరి చెత్త మరొకరి సమస్యగా కాకుండా చెత్తంతా సంపదే అనే దిశగా సాగుతున్నారు. అలాంటి ప్రయత్నాల్లో ఇవి కొన్ని..
మిగిలిన వంట నూనెలతో..బయోడీజిల్
వ్యర్థాలను ప్రకృతిలో కుమ్మరించటం. శతాబ్దాలుగా చేస్తున్నదిదే. ఉద్గారాలను తగ్గించటంపై పెద్దగా దృష్టి పెట్టింది లేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. వంటకాల్లో వాడగా మిగిలిపోయిన నూనెలు, జంతువుల కొవ్వు, చికెన్ కొవ్వు, పసుపు గ్రీజు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల తయారీ అనంతరం మిగిలిపోయే పదార్థాలను నాణ్యమైన డీజిల్గా మారుస్తుండటమే దీనికి నిదర్శనం. ఇవి పునరుత్పాదక ప్లాస్టిక్, రసాయనాల తయారీకి అవసరమైన హైడ్రోకార్బన్ల ఉత్పత్తికీ వినియోగపడుతుండటం విశేషం. ఇలాంటి అధునాతన జీవ, పునర్వినియోగ ఇంధనాలను ‘హైడ్రోట్రీటెడ్ వెజిటేబుల్ ఆయిల్’ (హెచ్ఓవీ) అనీ పిలుచుకుంటున్నారు. దీన్ని తయారుచేయటంపై ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. నెస్టే ఆయిల్ అనే సంస్థ నెక్స్బీటీఎల్ ప్రక్రియతో వ్యర్థ నూనెలు, కొవ్వుల నుంచి పెద్ద ఎత్తున డీజిల్, విమాన ఇంధనం తయారీకి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు ఇందులో పామాయిల్నే ముడి పదార్థంగా వాడేవారు. ఇప్పుడు పూర్తిగా వ్యర్థ నూనెలు, కొవ్వులనే వినియోగిస్తున్నారు. వీటి నుంచి తయారైన డీజిల్ను జెట్ ఇంధనంలో కలిపి వాడటంపై సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా ప్రయోగాలు చేపట్టింది. ట్యూనీషియాలోని బయోడెక్స్-ఎస్ఏ, గ్రీస్లోని సెప్రీ అనే కంపెనీలు సైతం ఇలాంటి ప్రయత్నమే మొదలెట్టాయి. నోవోజైమ్స్ అనే సంస్థ మరో అడుగు ముందుకేసి వ్యర్థ నూనెల నుంచి బయోడీజిల్ను తయారుచేయటానికి ఎంజైమ్లతో కూడిన ప్రక్రియను రూపొందించింది. వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చిన ఎంజైమ్ పరిష్కార మార్గమిదే. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వ్యర్థ నూనెలను సేకరించి, వాటిని ఇంధనంగా మార్చటానికి నెదర్లాండ్స్లోని మెక్డొనాల్డ్ సంస్థ నెస్టే, హవి కంపెనీలతో చేతులు కలిపింది. ఈ ఇంధనాన్ని వ్యర్థాలను సేకరించే వాహనాలు, ఆహార పదార్థాలను సరఫరా చేసేవారి వాహనాలకు వినియోగించాలని నిర్ణయించింది. ఏదేమైనా వాడిన నూనెలను వ్యర్థాలుగా కాకుండా ఇంధన వనరుగా చూడాలనే స్పృహ రోజురోజుకీ పెరుగుతోంది.
ఎలా చేస్తారు?
వాడగా మిగిలిన నూనెలను, వ్యర్థ కొవ్వులను బయోడీజిల్గా ఎలా మారుస్తారో తెలుసా? ట్రాన్సెస్టెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా. ఇది నూనె, కొవ్వులను గ్లైసిరిన్, మిథైల్ ఎస్టర్లు అనే పదార్థాలుగా విడగొడుతుంది. మిథైల్ ఎస్టర్లంటే ఏంటో కావు. బయోడీజిల్కు రసాయన నామమే. దీన్నే శుద్ధి చేసి ఇంధనంగా మారుస్తారు.
పాత సర్క్యూట్లతో బంగారం
పాత కంప్యూటర్లు, పారేసిన స్క్రీన్లు, పగిలిపోయిన స్మార్ట్ఫోన్లు, చెడిపోయిన ట్యాబెట్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే ఇ-వ్యర్థాలు ఎన్నెన్నో. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల టన్నుల ఇ-చెత్త పోగుపడుతోందని అంచనా. ఇది 4,500 ఈఫిల్ టవర్లు, 1.25 లక్షల జెంబో జెట్ విమానాలతో సమానం! చాలావరకు భూమి మీద గుంతల్లో నిండుతున్నప్పటికీ ఇదంతా ఉత్త చెత్త కాదు. ఎలక్ట్రానిక్ పరికరాల సర్క్యూట్లలో బంగారం, రాగి, కోబాల్ట్, ప్లాటినం వంటి విలువైన లోహాలూ ఉంటాయి. వీటిని వెలికి తీయటమూ ఇప్పుడు పరిశ్రమగా మారుతోంది. సాధారణంగా సర్క్యూట్ల నుంచి వేడి (పైరోమెటలర్జీ), రసాయనాల (హైడ్రోమెటలర్జీ) ప్రక్రియల ద్వారా లోహాలను వెలికి తీస్తుంటారు. ఇందుకు విద్యుత్తు, ఇంధనాలు అవసరం. పైగా వీటిని మండించినప్పుడు, శుద్ధి చేసినప్పుడు వెలువడే విష వాయువులు, వ్యర్థాలు క్యాన్సర్ల వంటి తీవ్ర జబ్బులకు దారితీస్తాయి. ఇలాంటి దుష్ప్రభావాలేవీ లేకుండా సూక్ష్మక్రిములతో లోహాలను వెలికితీసే ప్రక్రియ (బయోలీచింగ్) వేగంగా పుంజుకుంటోంది. నిజానికిదేమీ కొత్త పద్ధతి కాదు. ముడి ఖనిజాల నుంచి లోహాలను తీయటానికి మైనింగ్ ఆపరేటర్లు ఉపయోగించేదే. ఇ-వ్యర్థాల శుద్ధిలో అంతగా వాడుకోవటం లేదు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే దీనికి ఎక్కువ సమయం పడుతుండటం, అంత ఎక్కువ మొత్తంలో లోహాలను సంగ్రహించలేకపోవటమే కారణం. అయినా కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సూక్ష్మక్రిములతో సర్క్యూట్ల నుంచి బంగారాన్ని వెలికి తీయటం మీద ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఎలా చేస్తారు?
ముందుగా సర్యూట్ బోర్డులు, ర్యామ్ స్టిక్స్, ప్రాసెసర్ల వంటి వ్యర్థాలను ముక్కలు చేసి, సన్నటి పొడిగా మారుస్తారు. దీన్ని కొన్ని రసాయనాలతో కలిపి, యంత్రాల సాయంతో ఒత్తిడికి గురిచేసి.. ద్రవ, ఘన పదార్థాలను వేరు చేస్తారు. ఘన పదార్థంలోనే బంగారం ఉంటుంది. దీనికి మరింత గాఢమైన రసాయనాలను జోడించి, ఈ మిశ్రమానికి క్యుప్రియావిడస్ మెటలిడ్యురాన్స్ అనే సూక్ష్మక్రిములను జతచేస్తారు. కొన్ని గంటల తర్వాత సూక్ష్మక్రిములు లోహాలను సంగ్రహించుకొని గుజ్జులా మారతాయి. ఇది ఎండిన తర్వాత ఊదా రంగులో కనిపిస్తుంది. నానోపార్టికల్స్ రూపంలో బంగారం ఇలాగే కనిపిస్తుంది మరి. దీన్ని రిఫైనర్లో వేసి బంగారాన్ని వెలికి తీస్తారు.
పట్టణ ఘన వ్యర్థాలతో జెట్ ఇంధనం
పట్టణాలు విస్తరిస్తున్నకొద్దీ ఘన వ్యర్థాలూ పెరిగిపోతున్నాయి. ఇవి 2050 నాటికి 340 కోట్ల టన్నులకు చేరుకోవచ్చన్నది ప్రపంచబ్యాంకు అంచనా. ప్రస్తుతం ఈ ఘన వ్యర్థాలను చాలావరకు భూమిలోనే నింపుతున్నారు. కేవలం ఐదో వంతు మాత్రమే పునర్వినియోగిస్తున్నారు. అందుకే వీటిని పునర్వినియోగించుకునే అధునాతన పద్ధతుల ఆవశ్యకత రోజురోజుకీ పెరుగుతోంది. వీటిని ఇథనాల్ లేదా జెట్ విమానాల ఇంధనంగా మార్చగలిగితే? ఫుల్క్రమ్ బయోఎనర్జీ, నెస్టే వంటి సంస్థలు దీని మీదే దృష్టి సారించాయి. ఘన వ్యర్థాలను ఇంధనంగా ఎలా మారుస్తారన్నదేనా మీ సందేహం. భూగర్భంలో శిలాజాలు పెట్రోలుగా మారినట్టుగానే! మరో 15 ఏళ్లలో విమాన ప్రయాణాలు రెండింతలు పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాల నుంచి తయారుచేసే జెట్ ఇంధనం కొంతవరకైనా ప్రత్యామ్నాయం కాగలదని ఆశిస్తున్నారు. సెల్యులోజ్తో కూడిన వ్యర్థ పదార్థాలను పులియబెట్టటం ద్వారా ఇథనాల్ను తయారుచేయటం మరో పద్ధతి. దీన్ని కూడా శుద్ధిచేసి జెట్ ఇంధనంగా వాడుకోవచ్చు. మనసుంటే మార్గముంటుందనటానికి ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి?
ఎలా చేస్తారు?
ఘన వ్యర్థాలను ముందుగా సేంద్రియ, ప్లాస్టిక్ పదార్థాలుగా వేరుచేస్తారు. సేంద్రియ పదార్థాలను ఒక పెద్ద పాత్రలో వేసి అత్యధిక పీడనం, ఉష్ణోగ్రతతో ముక్కలు ముక్కలుగా చేస్తారు (గ్యాసిఫికేషన్). అనంతరం వీటిలోని కార్బన్, హైడ్రోజన్ మూలకాలు హైడ్రోకార్బన్గా మారతాయి. భూమిలోంచి మనకు లభించే సహజ వాయువు, చమురుకు మూలం ఇదే. ఈ హైడ్రోకార్బన్ను గంధకం, ఇతర పదార్థాలతో శుద్ధి చేసి జెట్ ఇంధనంగా రూపొందిస్తారు.
కార్బన్డయాక్సైడ్తో ద్రవ, వాయు ఇంధనాలు
ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. వాతావరణ మార్పునకు కారణమవుతున్న కార్బన్డయాక్సైడ్నే ఒడిసి పట్టి ఇంధనాలుగా, ఇతర పదార్థాలుగా మార్చి వినియోగించుకోవటం ఇలాంటి ప్రయత్నమే. భూతాపాన్ని తగ్గించటానికి కర్బన ఉద్గారాలను తగ్గించుకోవటం చాలా కీలకం. ప్రస్తుతం పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ మూలంగానే ప్రపంచవ్యాప్తంగా కార్బన్డయాక్సైడ్ మోతాదులు పెరిగిపోతున్నాయి. నిజానికి కర్బనం చట్రాన్ని నియంత్రించటానికి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్డయాక్సైడ్ను పిండి పదార్థంగా మారుస్తాయి. అయితే శిలాజ ఇంధనాలను అతిగా వాడటం, అడవులను నరకటం, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వంటివి దీన్ని గణనీయంగా దెబ్బతీస్తున్నాయి. కొన్ని అంచనాల ప్రకారం 2100 నాటికి వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ స్థాయులు 590 పీపీఎం వరకు చేరుకోవచ్చు. ధ్రువప్రాంతాల్లో ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగిపోవచ్చు. ఇది భూమ్మీద సమస్త ప్రాణుల మనుగడకే పెద్ద గండంగా పరిణమిస్తుంది. అందుకే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవటం అత్యంత ఆవశ్యకమైంది. మంచి విషయం ఏంటంటే- ఈ కర్బన ఉద్గారాలను ఒడిసి పట్టుకునే అవకాశముండటం. దీన్ని విద్యుత్రసాయన ప్రక్రియల ద్వారా ఇంధనాలుగానూ మలచుకోవచ్చు. సౌరశక్తి వంటి పునర్వినియోగ విద్యుత్తును వాడుకోవటం ద్వారానే దీన్ని సాధించుకునే వీలుండటం విశేషం. అందుకే కార్బన్డయాక్సైడ్ నుంచి ఇంధనాలను తయారుచేయటానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
ఎలా చేస్తారు?
కార్బన్డయాక్సైడ్ను ఇంధనంగా మార్చటానికి రకరకాల పద్ధతులు రూపొందుతున్నాయి. పలు కంపెనీలు వివిధ ప్రక్రియలను అవలంబిస్తున్నాయి. గాలిలోని కార్బన్డయాక్సైడ్ను ఒడిసిపట్టి, క్యాల్షియం కార్బొనేట్ రజనుగా మార్చి, దాన్నుంచి ఇంధనాన్ని తయారుచేయటం ఒక పద్ధతి. ఇందులో ముందుగా గాలిని పెద్ద జాలీలాంటి పరికరం ద్వారా పోయేలా చేసి, ప్రత్యేక ద్రావణం సాయంతో కార్బన్డయాక్సైడ్ను ఒడిసి పట్టి, సన్నటి రజనుగా మారుస్తారు. ఈ రజనును మండించి శుద్ధ కార్బన్డయాక్సైడ్ను పుట్టిస్తారు. దీన్ని హైడ్రోజన్తో కలిపి ఇంధనాన్ని సృష్టిస్తారు. ఫొటోఎలక్ట్రిక్కెమికల్ ప్రక్రియతోనూ రూపొందిస్తారు. ఇందుకోసం నాసా ఇటీవల సౌరశక్తితో పనిచేసే పలుచటి పొరల సాయంతో కార్బన్డయాక్సైడ్ను ఇంధనంగా మార్చే కొత్త ప్రక్రియనూ రూపొందించింది. మెటల్ ఆక్సైడ్ పొరల మీద కూర్చిన ఫొటోఎలక్ట్రిక్కెమికల్ సెల్స్ ఇందులోని కీలకాంశం. కార్బన్డయాక్సైడ్ను మిథేన్, ఇథేన్ వంటి వాయువులుగానూ.. ఫార్మేట్, మిథనాల్, ఇథనాల్ వంటి ద్రవ ఇంధనాలుగానూ మార్చటానికి ఫొటోఎలక్ట్రిక్కెమికల్ పద్ధతి అనువుగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్వాచ్ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
‘కీప్’ గోయింగ్!
రోజురోజుకీ నోట్-టేకింగ్ యాప్స్కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్ టేకింగ్ యాప్లూ అందుబాటులో ఉన్నాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
అమెజాన్ మ్యూజిక్లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్
సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్ యాప్లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్ను అందుబాటులోకి తెచ్చింది. -
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
వెబ్లోనూ ట్రూకాలర్
స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్ కాల్స్ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్ బ్రౌజర్ రూపంలోకీ మారింది. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
వెబ్క్యామే స్కానర్
డెస్క్టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్లా వాడుకుంటే సరి. మ్యాక్లోనైతే- ఫొటో బూత్ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్ను వెబ్క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!