రాష్ట్రానికి మరో మూడు ప్రముఖ సంస్థలు

రాష్ట్రానికి మరో మూడు ప్రసిద్ధ సంస్థలు రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు తమ కేంద్రాల ఏర్పాటుకు సుముఖత

Published : 23 Mar 2022 02:17 IST

రూ.150 కోట్లతో ‘కాల్‌అవే గోల్ఫ్‌’ డిజిటెక్‌ కేంద్రం

ఐటీ అభివృద్ధి కేంద్రం నెలకొల్పనున్న ‘ఫిస్కర్‌’

రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్‌ వాహనాల సంస్థ

అక్టోబరులో ‘క్వాల్కమ్‌’ రెండో అతిపెద్ద ప్రాంగణం ప్రారంభం

రూ.3,904 కోట్లతో ప్రాంగణాన్ని ప్రారంభించనున్న సంస్థ

ఆయా సంస్థల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రానికి మరో మూడు ప్రసిద్ధ సంస్థలు రానున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు తమ కేంద్రాల ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేశారు. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ గోల్ఫ్‌ క్రీడాపరికరాల తయారీ సంస్థ ‘కాల్‌అవే గోల్ఫ్‌’.. అమెరికా తర్వాత అతి పెద్దదైన డిజిటల్‌ టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రముఖ విద్యుత్‌ వాహనాల సంస్థ ఫిస్కర్‌ ఐఎన్‌సీ తెలంగాణలో రూ.100 కోట్లతో ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కల్పించనుంది. ఏడాదిలోగా కార్యకలాపాలను ప్రారంభించనుంది. సాఫ్ట్‌వేర్‌, వైర్‌లెస్‌ టెక్నాలజీ, సెమీ కండక్టర్‌ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజం క్వాల్కమ్‌ సంస్థ రూ.3,904.55 కోట్లతో ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో వచ్చే అక్టోబరులో ప్రారంభించనున్నట్లు తెలిపింది.

కాల్‌అవే సంస్థ గోల్ఫ్‌ బంతులు, స్టిక్‌, దుస్తులు, ఇతర సామగ్రిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. రూ.24 వేల కోట్ల వార్షికాదాయం, 2400 మంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ భారత్‌లో డిజిటెక్‌ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. సంస్థ ఆహ్వానం మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ మంగళవారం కాలిఫోర్నియా సమీపంలోని కాల్‌అవే ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు. సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, ముఖ్య ఆర్థికాధికారి బ్రయన్‌ లించ్‌, సీఐవో సాయి కూరపాటిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం లించ్‌ మాట్లాడారు. ‘‘మా సంస్థ ద్వారా 140 దేశాలకు, రెండున్నర లక్షలకు పైగా క్లబ్బులకు క్రీడా సామగ్రిని సరఫరా చేస్తున్నాం. గోల్ఫ్‌లో డేటా అనలిటిక్స్‌, ఐటీ సేవలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్‌లో డిజిటెక్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా ఆటగాళ్ల ఆటతీరు సహా వారి క్రీడా నైపుణ్యాభివృద్ధి, సమస్యలకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలను సూచిస్తాం. తొలి దశలో అత్యంత నైపుణ్యం కలిగిన 300 మంది ఐటీ రంగ నిపుణులకు ఉపాధి కల్పిస్తాం. త్వరలోనే తెలంగాణను సందర్శిస్తాం’’ అని తెలిపారు. కాల్‌అవేతో ఒప్పందంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. కాల్‌అవే డిజిటెక్‌ కేంద్రం ద్వారా గోల్ఫ్‌ క్రీడాకేంద్రంగానూ రాష్ట్రం గుర్తింపు పొందుతుందన్నారు. రాష్ట్రంలో గోల్ఫ్‌ క్రీడాపరికరాల తయారీ కేంద్రాన్నీ ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతినిధులను కోరారు. హైదరాబాద్‌లో క్రీడాపర్యాటకంలో భాగం కావాలని ఆహ్వానించారు.

ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి భేష్‌: ఫిస్కర్‌

ఫిస్కర్‌ ఆటోమోటివ్‌ సంస్థ అధునాతన విద్యుత్‌ వాహనాలను ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. తమ కార్యకలాపాలను భారత్‌లోనూ విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణను ఎంచుకుంది. సంస్థ ఆహ్వానంతో మంగళవారం ఫిస్కర్‌ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్‌ సందర్శించి.. సంస్థ ఛైర్మన్‌, సీఈవో హెన్రిక్‌ ఫిస్కర్‌, ముఖ్య ఆర్థిక, నిర్వహణ అధికారిణి గీతాగుప్తా ఫిస్కర్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఫిస్కర్‌ ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు ప్రణాళికను కేటీఆర్‌కు వివరించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం తమకెంతో నచ్చిందని, ఐటీ రంగంలో తెలంగాణ గొప్ప ప్రగతి సాధించిందని.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఐటీ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యుత్తమమైన విద్యుత్‌ వాహనాల తయారీ విధానాన్ని తాము విడుదల చేశామని, ఇప్పటికే 17 సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చాయని కేటీఆర్‌ అన్నారు. ఫిస్కర్‌ కేంద్రం ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

అయిదేళ్లలో 8,700 మందికి ఉపాధి అవకాశాలు: క్వాల్కమ్‌

శాండియాగోలోని క్వాల్కమ్‌ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎఫ్‌వో ఆకాష్‌ పాల్కివాలా, ఉపాధ్యక్షులు జేమ్స్‌ జిన్‌, లక్ష్మి రాయపూడి, పరాగ్‌ అగాసే, డైరెక్టర్‌ దేవ్‌సింగ్‌, ఇతర ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న తమ కార్యాలయం పురోగతిని క్వాల్కమ్‌ ప్రతినిధులు వివరించారు. 15.72 లక్షల చదరపు అడుగుల కొత్త కార్యాలయం ద్వారా అయిదేళ్లలో 8,700 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీతోపాటు వ్యవసాయ, విద్యా రంగాల్లో తెలంగాణలో ఉన్న అపారావకాశాలను అందిపుచ్చుకోవడమే తమ విస్తరణ ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తెలిపారు. అగ్రిటెక్‌, విద్యారంగం, కనెక్టెడ్‌ డివైస్‌ల వినియోగం, స్మార్ట్‌ సిటీ కార్యక్రమాల్లో తాము భాగస్వాములమవుతామని చెప్పారు. భవిష్యత్తులో సెమీకండక్టర్‌ చిప్‌ల తయారీ వంటి రంగాల్లో తెలంగాణ మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారేందుకు కొత్త కార్యాలయం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని