నేలరాలిన త్రిదళపతి
యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ తమిళనాడులో బుధవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్లోని సైనిక ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం
ఆయన సతీమణి మధులిక కూడా..
తమిళనాడులోని కున్నూర్ సమీపంలో ఘోర దుర్ఘటన
మొత్తం 13 మంది మృత్యువాత
మృతుల్లో చిత్తూరు జిల్లావాసి సాయితేజ
రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
తీవ్రగాయాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్
నాలుగు దశాబ్దాలకు పైగా భరతమాత సేవలో తరిస్తున్న మేరునగ శిఖరం కూలిపోయింది! భారత తొలి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ నీలగిరి కొండల్లో నేలకొరిగారు. మాతృభూమి సేవకు సైనిక కళాశాలలో సన్నద్ధమవుతున్న యువ కిశోరాలకు సందేశాన్నిచ్చేందుకు తరలివెళ్లిన ఆయన.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తమిళనాడులోని కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు మరో 11 మంది కూడా మృత్యువాతపడ్డారు.
యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ తమిళనాడులో బుధవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్లోని సైనిక ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ఆయన సీడీఎస్ వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరు. తాజా ప్రమాదానికి పొగమంచే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. జనరల్ రావత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తాజా దుర్ఘటనపై భారత వాయుసేన (ఐఏఎఫ్) విచారణకు ఆదేశించింది.
తమిళనాడులోని నీలగిరి జిల్లా వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాల (డీఎస్ఎస్సీ)లో సిబ్బంది, శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి జనరల్ రావత్ బుధవారం ప్రసంగించాల్సి ఉంది. అందుకోసం భార్య మధులిక, మరికొంతమంది సైనిక ఉన్నతాధికారులతో కలిసి ఆయన దిల్లీ నుంచి బుధవారం ఉదయం 11:34 గంటలకు కోయంబత్తూరు జిల్లా సూలూర్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 11:48 గంటలకు భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్లో వెల్లింగ్టన్కు బయలుదేరారు. దాదాపు 45 నిమిషాల్లో ఆయన డీఎస్ఎస్సీకి చేరుకోవాల్సి ఉంది. అయితే 12:22 గంటలకు ఘోరం జరిగిపోయింది. గమ్యస్థానానికి 16 కిలోమీటర్ల దూరంలో... కున్నూర్ సమీపంలోని కాట్టేరి కొండ అటవీ ప్రాంతంలో నంజప్పసత్రం వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.
అగ్నిగోళంలా కూలిపోయి..
అధికార వర్గాలు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రమాద సమయంలో హెలికాప్టర్ తక్కువ ఎత్తులో ప్రయాణిస్తోంది. పొగమంచు కారణంగా అప్పుడు వెలుతురు సరిగా లేదు. కాట్టేరి కొండ ప్రాంతంలో ఓ లోయ వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. భారీ శబ్దంతో చెట్ల మీద కూలిపోయింది. మంటలు అంటుకోవడంతో అది అగ్నిగోళంలా కనిపించింది. కూలిపోతుండగానే హెలికాప్టర్ నుంచి ఇద్దరు వ్యక్తులు బయటకు దూకారు. అప్పటికే వారు సజీవ దహనమవుతున్నారు. ప్రమాద తీవ్రతకు పలు చెట్లు కాలి బూడిదయ్యాయి. సహాయ చర్యలు చేపట్టేందుకు స్థానికులు ఘటనాస్థలానికి వేగంగా తరలివచ్చారు. అయితే- భారీగా చెలరేగుతున్న మంటలు, పూర్తిగా కమ్మేసిన పొగ పెద్ద అడ్డంకులుగా నిలిచాయి. వెంటనే దగ్గరకు వెళ్లకుండా వారిని నిలువరించాయి. అయినప్పటికీ కొంతమంది బకెట్లు, పైపులతో నీటిని పోస్తూ మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. పలువురి మృతదేహాలు మాడి మసయ్యాయి. అవయవాలు, శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొండప్రాంతం కావడం, ప్రమాద సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది, ఇతర దళాలు ఘటనాస్థలానికి చేరుకోవడం కాస్త ఆలస్యమైంది. హెలికాప్టర్ నివాసస్థలాలకు దూరంగా కూలిపోవడంతో మరింత ప్రాణనష్టం తప్పింది. కూలిపోయే సమయంలో ఓ భవనాన్ని అది తాకినా.. ఆ ఇంటి లోపల ఎవరూ లేరు. సహాయక చర్యలు మొదలయ్యే సమయానికి.. వరుణ్ సింగ్తోపాటు మరికొందరు కూడా ప్రాణాలతో ఉన్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. ప్రమాదంలో మృతుల శరీరాలు తీవ్రంగా కాలిపోయాయి. డీఎన్యే పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించారు.
కాలిపోతున్నా పరిగెత్తారు!
హెలికాప్టర్ కూలిపోయినచోట బీభత్స వాతావరణం కనిపించింది. మృతుల శరీర భాగాలు, లోహవిహంగ శకలాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బాధితుల దుస్థితిని చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఓ తేయాకు తోటకు చాలా దగ్గరగా ఈ దుర్ఘటన జరిగింది. తోటలో పనిచేస్తున్న కూలీలు, చుట్టుపక్కలవారు తొలుత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం తీరు, తర్వాతి పరిణామాలను కొందరు ప్రత్యక్ష సాక్షులు వివరిస్తూ.. ‘‘ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లు అనిపించింది. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్ చెట్లను ఢీకొడుతూ కూలిపోవడం చూశాం. ఆ వెంటనే పేలుడు సంభవించింది. హెలికాప్టర్ శిథిలాల నుంచి లేచిన ఓ వ్యక్తికి మంటలు అంటుకొని ఉన్నాయి. అయినప్పటికీ ప్రాణాలు కాపాడుకునేందుకు కొంతదూరం పరిగెత్తి ఆయన కుప్పకూలిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులూ కాలిపోతూనే పరిగెత్తేందుకు ప్రయత్నించినప్పటికీ.. పక్కనే పడిపోయారు. ఆ దృశ్యాలు భయానకంగా కనిపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటికి.. సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు హెలికాప్టర్లో ఉన్నట్లు మాకు తెలిసింది’’ అని వివరించారు.
మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్ శకలాలు
ఆయన చదువుకున్న కళాశాలే..
జనరల్ రావత్ వెల్లింగ్టన్లోని డీఎస్ఎస్సీలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ కళాశాలలో ప్రసంగించేందుకు వెళ్తుండగానే ఆయన మరణించడం మరింత బాధాకరం. సీడీఎస్గా ఆయన పదవీకాలం ఈ నెలాఖరుతో రెండేళ్లు పూర్తయ్యేది.
పోలీసులకు మేమే సమాచారమిచ్చాం
- ‘ఈటీవీ భారత్’తో కున్నూర్ వాసి కృష్ణకుమార్
ఇంటి వద్ద పనులు చేసుకుంటుండగా నాకు ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. అటువైపుగా చూస్తే.. చెట్టును హెలికాప్టర్ ఢీకొట్టడం కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లా. హెలికాప్టర్ మొత్తం కాలిపోయింది. చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది. మా పక్కింటి వ్యక్తిని పిలిచి.. ఏం జరిగిందో చెప్పా. ఆ వెంటనే మేం పోలీసులకు సమాచారమిచ్చాం.
-ఈనాడు-చెన్నై, న్యూస్టుడే-కోయంబత్తూరు, కున్నూర్
విషాద యానం
*ఉదయం 9: వాయుసేనకు చెందిన ఎంబ్రాయెర్ విమానంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, రక్షణ సిబ్బంది దిల్లీ నుంచి తమిళనాడులోని సూలూర్ వైమానిక స్థావరానికి బయల్దేరారు.
* 11.34: సూలూర్ వైమానిక స్థావరంలో దిగారు.
* 11.48: సూలూర్ నుంచి ఐఏఎఫ్కు చెందిన ఎంఐ17వీ5 హెలికాప్టర్లో రావత్ దంపతులు, 12 మంది రక్షణ సిబ్బంది వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి బయల్దేరారు.
* మధ్యాహ్నం 12.22: తమిళనాడులోని కున్నూర్ సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన హెలికాప్టర్.
* 1.53: హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు ధ్రువీకరించిన ఐఏఎఫ్.
* సాయంత్రం 6.03: జనరల్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐఏఎఫ్ ప్రకటన.
* వాయుసేన అధికారి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
భరతమాత సేవలో 43 ఏళ్లు..
* 1978 డిసెంబరు 16న బిపిన్ రావత్ కమిషన్డ్ అధికారిగా సైన్యంలో చేరారు
* 2016 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్గా బాధ్యతలు 2019 డిసెంబరు 31న భారత తొలి త్రిదళాధిపతిగా నిమితులయ్యారు
* బిపిన్ అందుకున్న అత్యున్నత పతకాలు ఉత్తమ యుద్ధసేవా మెడల్, అతి విశిష్ట సేవామెడల్, యుద్ధసేవా మెడల్, సేవామెడల్, విశిష్ట సేవామెడల్ అసమాన వ్యూహకర్త బిపిన్ రావత్ ఓ అసమాన సైనికుడు, అసలైన దేశభక్తుడు. భారత సైనిక బలగాల ఆధునికీకరణకు అవిరళ కృషి చేశారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. రావత్ సేవల్ని దేశం ఎప్పటికీ మరువదు. ఆయన మృతి నన్ను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఓం శాంతి.
- ప్రధాని నరేంద్ర మోదీ
జనరల్ బిపిన్ రావత్ దంపతులు పలుమార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 2017 మార్చి 9న తిరుమలకు చేరుకుని 2 రోజుల పాటు ఇక్కడే బస చేసి రెండు సార్లు స్వామివారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుల్లా వైకుంఠం క్యూలైన్లో వెళ్లి దర్శనం చేసుకోవడం విశేషం.
నేడు దిల్లీకి భౌతికకాయాల తరలింపు
జనరల్ రావత్ సహా ఇతర మృతులకు వెల్లింగ్టన్లోని మద్రాసు రెజిమెంటల్ కేంద్రం (ఎంఆర్సీ)లో గురువారం ఉదయం పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తారు. తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, ఐఏఎఫ్ అధిపతి వి.ఆర్.చౌధరి తదితరులు అక్కడి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రావత్ దంపతుల భౌతికకాయాలను కోయంబత్తూరుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి వాయుమార్గంలో దిల్లీకి తరలిస్తారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ‘భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ (సీసీఎస్)’కి ప్రమాద వివరాలను అధికారులు నివేదించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ డోభాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాద వివరాలను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్కు సైన్యాధ్యక్షుడు జనరల్ ఎం.ఎం.నరవణె విడిగా నివేదించారు. అంతకుముందు, దిల్లీలో జనరల్ రావత్ ఇంటికి వెళ్లిన రాజ్నాథ్.. ఆయన చిన్న కుమార్తెతో మాట్లాడారు.
ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ శకలాలు
హెలికాప్టర్ కూలిపోయిన ప్రాంతం
వీరపుత్రుడిని కోల్పోయాం
బిపిన్ రావత్ మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
దిల్లీ: హెలికాప్టర్ దుర్ఘటనలో త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోవడంపై యావద్దేశం దిగ్భ్రాంతి చెందింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, బాలీవుడ్ సహా పలు రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ప్రగాఢ సంతాపాన్ని తెలిపాయి.
అసాధారణ శౌర్యం
దేశం తన ధీర కుమారుల్లో ఒకరిని కోల్పోయింది. మాతృభూమి కోసం రావత్ నాలుగు దశాబ్దాల నిస్వార్థ సేవలు అందించారు. అసాధారణమైన శౌర్యం, వీరత్వం ఆయన సొంతం. హెలికాప్టర్ ప్రమాదం చాలా బాధాకరం.
- రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
ఎప్పటికీ గుర్తుండిపోతారు
దేశానికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా రావత్ సేవలు అందించారు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, వ్యూహాత్మక దార్శనికత ఆయన సొంతం. రక్షణ సామర్థ్యాన్ని, దేశ భద్రతను బలోపేతం చేయడంలో ఆయన కృషి ఎనలేనిది.
- ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
బాధాకరమైన రోజు
దేశానికి ఇది బాధాకరమైన రోజు. రావత్ సహా ప్రాణాలు కోల్పోయిన సైనికాధికారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. బిపిన్ అందించిన విలువైన సేవల్ని మాటల్లో చెప్పలేం.
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
తీరని లోటు
బిపిన్ అకాల మరణం.. సాయుధ దళాలకు, దేశానికి తీరని లోటు. అపారమైన అంకిత భావం, ధైర్య సాహసాలతో ఆయన సేవలందించారు. సాయుధ బలగాల ఉమ్మడి పనికి చక్కని ప్రణాళికలు రూపొందించారు. ప్రమాదంలో చనిపోయిన వారందరి కుటుంబాలకు నా సానుభూతి.
- రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.
దిగ్భ్రాంతి కలిగించింది
అనూహ్య ప్రమాద ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. ఈ కష్ట సమయంలో.. మా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయి. ఈ బాధాకర సమయంలో యావద్దేశం ఒక్కటిగా నిలుస్తోంది.
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
బిపిన్ రావత్ మరణం విషాదకరం.
- జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, పాక్ సైనిక బలగాల అధిపతి
గవర్నర్, సీఎంల సంతాపం
ఈనాడు, హైదరాబాద్: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్లు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రావత్ మరణం దేశానికి, భారత సైన్యానికి తీరని లోటని గవర్నర్ ఆవేదన వ్యక్తంచేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో రావత్తో పాటు ఆయన సతీమణి, పలువురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచి వేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
నోట మాట రావట్లేదు
మధులికా రావత్ తమ్ముడు యశ్వర్ధన్ సింగ్
దిల్లీ: అక్కాబావల మరణవార్త విని నోటమాట రావట్లేదని జనరల్ బిపిన్ రావత్ బావమరిది కువర్ యశ్వర్ధన్ సింగ్ ‘ఈటీవీ భారత్’కు చెప్పారు. మధ్యప్రదేశ్లోని శహ్డోల్ జిల్లా సొహాగ్పుర్ రియాసత్కు రియాసత్దార్తో పాటు, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసిన కువర్ మృగేంద్రసింగ్ కుమార్తె మధులిక. ఆమె చివరిసారిగా సొహాగ్పుర్కు 2012లో వచ్చారు. ఈసారి కొత్త సంవత్సర వేడుకలకు వస్తానని చెప్పారు. అంతలోనే ఈ ఘోరం చోటుచేసుకుంది.
జనరల్ బిపిన్ రావత్ ముక్కుసూటి మనిషి
డీఆర్డీవో సైన్యం కోసం అభివృద్ధిచేసే ముఖ్యమైన ప్రాజెక్టులపై జరిగే సమీక్షలకు జనరల్ రావత్ తప్పనిసరిగా హాజరయ్యేవారు. శాస్త్రవేత్తలతో కూర్చుని సైనికుల అవసరాలపై చర్చించేవారు. ఆయన ముక్కు సూటి మనిషి..నిజాన్ని నిర్భయంగా చెప్పేవారు. సీడీఎస్గా బాధ్యతలు చేపట్టాక సైన్యానికి అవసరమైన ఆయుధాలు సహా ఇతర రక్షణ సామగ్రి స్వదేశంలోనే తయారుకావాలని గట్టిగా కోరుకునేవారు. ఆత్మనిర్భర్ భారత్ను బాగా ప్రోత్సహించారు. ఆయనను కోల్పోవడం రక్షణ రంగానికి తీరని లోటు.
- డాక్టర్ జి.సతీష్రెడ్డి, డీఆర్డీవో ఛైర్మన్
అత్యంత సురక్షిత హెలికాప్టర్ అది
రెండు ఇంజిన్లు ఉన్న ఈ రష్యన్ తయారీ ఎమ్ఐ-17వీ5 హెలికాప్టర్ను ఎంతో సురక్షితమైనదిగా భావిస్తారు. 14-15 మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. సీడీఎస్ ప్రయాణిస్తున్న నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొనే ఉంటారు. పైగా కోయంబత్తూరు నుంచి కున్నూర్ చాలా దగ్గర. అంత దగ్గర దూరంలో, అంత ఘోర ప్రమాదం జరగడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద కారణాలేమిటో ఊహకు అందడం లేదు. పర్వత ప్రాంతాల్లో త్వరగా జరిగే వాతావరణ మార్పులు సహజంగా ప్రమాదాలకు కారణమవుతాయి. ఈ సమయంలో ఎక్కువ ఊహాగానాలు సరికాదు.
- ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి దత్తాత్రేయ, కిషన్రెడ్డి, బండి సంజయ్, రేవంత్రెడ్డి సంతాపం
జనరల్ బిపిన్ రావత్ మరణంపై హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, ఏపీ సీఎం జగన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, సీఎల్పీనేత భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.
- ఈనాడు, దిల్లీ, హైదరాబాద్
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తరలిస్తున్న సైనికులు
ప్రమాదం జరిగిన కున్నూర్ ప్రాంతం ఊహా చిత్రం
అంతా పొగమంచే!
కున్నూర్: మరొక్క 5 కిలోమీటర్లు వెళ్తే గమ్యం చేరుకునేవారే. అంతలోనే తమిళనాడులోని కున్నూర్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. సూలూర్ నుంచి బయల్దేరే ముందు ఆ మార్గంలో తక్కువ ఎత్తులో మబ్బులు ఉంటాయని, గాలిలో తేమ ఎక్కువగా, కొద్దిపాటి వర్షం ఉంటుందని వాతావరణ సూచనలో తెలిపారు. కానీ, ప్రమాద సమయానికి ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీలు ఉంటుందని, ఆ ప్రాంతంలోని నంజప్పన్ చతిరం లోయ మొత్తం దట్టమైన పొగమంచు అలముకుందని స్థానికులు చెబుతున్నారు. 2 మీటర్ల ముందు ఏముందో కూడా కనిపించని పరిస్థితి. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఎంఐ-17వి5 హెలికాప్టర్.. పొగమంచు లేకపోతే రెండు నిమిషాల్లో వెల్లింగ్టన్లో దిగేది. అంతలోనే ఇలా అయిపోయింది.
జనరల్ బిపిన్రావత్ బుధవారం తన సందేశాన్ని అందించేందుకు రావాల్సి ఉన్న నీలగిరి జిల్లా వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ
మరణించింది వీరే...
1. త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్
2. ఆయన భార్య మధులిక రావత్
3. రావత్ సైనిక సలహాదారు బ్రిగేడియర్ ఎల్.ఎల్.లిద్దర్
4. లెఫ్టినెంట్ కర్నల్ హరిజిందర్ సింగ్
5. వింగ్ కమాండర్ పి.ఎస్.చౌహాన్
6. స్క్వాడ్రన్ లీడర్ కె.సింగ్
7. జూనియర్ వారెంట్ ఆఫీసర్ దాస్
8. జూనియర్ వారెంట్ ఆఫీసర్ ఎ.ప్రదీప్
9. హవాల్దార్ సత్పాల్
10. నాయక్ గురుసేవక్ సింగ్
11. నాయక్ జితేందర్ కుమార్
12. లాన్స్ నాయక్ వివేక్ కుమార్
13. లాన్స్ నాయక్ సాయితేజ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..