Elderly Care: పలకరింపే పరమౌషధం

బతుకంతా పోరాటం.. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడం.. వాళ్ల కోసం కాస్తో కూస్తో కూడబెట్టడం.. ఈ చక్రభ్రమణంలో అలసి సొలసి.. వయసు మీద పడేసరికి శరీరం సహకరించక.. చిన్నా పెద్దా అనారోగ్యాలతో పడుతూ లేస్తూ గడపడం.. చాలా మందికి ఎదురయ్యే అనుభవాలివి. పురుషులైనా, స్త్రీలైనా వయసులో ఉన్నప్పుడు తమ తమ పనుల్లో కష్టపడకుండా వారి జీవితం గడవదు.

Updated : 13 Mar 2022 05:48 IST

వృద్ధుల అనారోగ్యాలకు అసలైన చికిత్స ఇదే

  శారీరక ఆరోగ్యంపై నిత్య పరిశీలన అవసరం  

  పెద్దలను చూసే దృక్కోణమూ మారాలంటున్న వైద్యనిపుణులు

అయితరాజు రంగారావు

ఈనాడు - హైదరాబాద్‌

తుకంతా పోరాటం.. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడం.. వాళ్ల కోసం కాస్తో కూస్తో కూడబెట్టడం.. ఈ చక్రభ్రమణంలో అలసి సొలసి.. వయసు మీద పడేసరికి శరీరం సహకరించక.. చిన్నా పెద్దా అనారోగ్యాలతో పడుతూ లేస్తూ గడపడం.. చాలా మందికి ఎదురయ్యే అనుభవాలివి. పురుషులైనా, స్త్రీలైనా వయసులో ఉన్నప్పుడు తమ తమ పనుల్లో కష్టపడకుండా వారి జీవితం గడవదు. తీరా పిల్లలు ఎదిగి, తాము విశ్రాంతి తీసుకునే సమయానికి అనారోగ్యాలు పీడిస్తే యాతనే. దీనికితోడు.. ఓపిక సన్నగిల్లిన తమను ఎవరూ పట్టించుకోవడంలేదని భావిస్తే కలిగే మనోవేదన వారి ఆరోగ్యాన్ని మరింత కుంగదీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దల శారీరక ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెట్టడం తప్పనిసరని, నిత్యం ఓ పలకరింపు.. కాస్త సాంత్వన వచనాలు.. వారు చెప్పే విషయాలపై శ్రద్ధ చూపడం వంటివి వృద్ధుల ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు వైద్యనిపుణులు. ‘‘వృద్ధాప్యంలో వచ్చే జబ్బులే కాదు.. వృద్ధులను ప్రభావితం చేసే ఇతర పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. పెద్దవయసు వారిని చూసే దృక్కోణంలోనే మార్పు రావాలి.

చిన్న సమస్యను నిర్లక్ష్యం  చేసినా.. మలివయసులో తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని’’  వైద్యనిపుణులు చెబుతున్నారు. వృద్ధులకు చికిత్సపై ఆసుపత్రుల్లో వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనీ సూచిస్తున్నారు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు.. వాటిని ఎదుర్కోవడంలో అవగాహనపై యూకేలో ‘మలివయసు ఆరోగ్య సంరక్షణ (జిరియాట్రిక్స్‌)’లో సేవలందిస్తున్న వైద్యులతో ‘ఈనాడు’ ప్రత్యేకంగా మాట్లాడింది.

గుర్తించడానికే అధిక సమయం

* పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ సోకితే వెంటనే లక్షణాలు బయటపడి.. తల్లిదండ్రులు త్వరగా గుర్తించగలుగుతారు. అదే పెద్దవారిలో లక్షణాలు బయటకు కనిపించడానికి 48-72 గంటలు పడుతుంది. ఉదాహరణకు రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ (సెప్సిస్‌) వస్తే.. పిల్లలకు గంట, రెండు గంటల్లోనే విపరీతమైన జ్వరం వస్తుంది. త్వరగా గుర్తించి వైద్యుడి వద్దకు తీసుకెళ్లడానికి వీలుంటుంది. 65 ఏళ్లు దాటినవారికైతే ఇవన్నీ నెమ్మదిస్తాయి. గుర్తించే సమయానికే ఆలస్యమై.. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.

* 70 ఏళ్ల వృద్ధుడు మూడు రోజులుగా సరిగా అన్నం తినడం లేదు. నీరసంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు మతిమరుపు కనిపిస్తోంది. కొద్దిగా జ్వరం వస్తోంది. ఈ స్థితిలో వైద్యుడి వద్దకు వచ్చేసరికే రోగి డీహైడ్రేషన్‌కు (ఒంట్లో నీరు, లవణాలు ఆవిరైపోవడం) గురై ఉంటాడు. పైగా తీసుకునే ఆహారం తగ్గిపోయినప్పుడు.. బీపీ, షుగర్‌లకు వాడే మందులే విషతుల్యమయ్యే అవకాశాలుంటాయి. ఈ వయసు వారు కిందపడితే తుంటి ఎముక విరిగే అవకాశాలు 40-50% వరకూ ఉన్నాయి. 3 రోజుల్లోగా సర్జరీ చేయకపోతే.. 90% మందిలో ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుంది.

డీహైడ్రేషన్‌తో ప్రమాదం

వయసు పైబడినప్పుడు మాత్రలు క్రమం తప్పకుండా వేసుకుంటారు కానీ, తిండి సహించడం లేదనో.. నోరు చేదుగా ఉందనో ద్రవ, ఘనాహారాలను తగ్గించేస్తుంటారు. దీంతో డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఆ ప్రభావం మూత్రపిండాలపై పడి, డయాలసిస్‌ చేయాల్సి వస్తుంది. అందుకోసం కొత్త మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని నివారించాలంటే వృద్ధులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా కుటుంబసభ్యులు జాగ్రత్త తీసుకోవాలి. ఏ మాత్రలు ఎప్పుడు వేసుకోవాలో తెలిసేలా పెట్టెలను ఏర్పాటు చేయాలి.


విసుగు చూపితే కుంగుబాటే

కొందరు వృద్ధులు అప్పుడే చెప్పిన విషయాలను కూడా మరిచిపోతుంటారు. అలాంటప్పుడు విసుక్కోవడం, కేకలు వేయడం వంటివి చేయకూడదు. తమకంటే చిన్నవారు గట్టిగా మందలిస్తే వారు మానసికంగా కుంగిపోతారు. వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఓపిక, శాంతం వహించాలి. రోజులో కొంత సమయమైనా వారితో కూర్చొని మాట్లాడాలి. పలకరింపుతో వారిలో కొత్త ఉత్సాహం వస్తుంది. అప్పుడు మందులు వాడాల్సిన అవసరమూ తగ్గుతుంది. దూరంగా ఉండేవారు పెద్దలతో కనీసం వీడియో కాల్‌ చేసైనా సరే.. రోజూ మాట్లాడడం మేలు.


వారి మాటలు ఓపిగ్గా వినాలి
- డాక్టర్‌ సుబ్బారావు గంజం, కన్సల్టెంట్‌, జీరియాట్రిక్‌ అండ్‌ స్ట్రోక్‌ మెడిసిన్‌, నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌, యూకే

* వృద్ధాప్యంలో వచ్చే ప్రతి సమస్యకూ మందు బిళ్లలివ్వడం పరిష్కారం కానే కాదు. పెద్దవారిలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు.. వారు చెప్పేది ఓపికగా వినాలి. నీకేం తెలియదులే అని కొట్టిపడేయకూడదు.

* తమ పనులు తామే చేసుకోవడానికి వారికి కుటుంబ సభ్యులు అండగా నిలవాలి. ఉదాహరణకు మరుగుదొడ్డికి వెళ్లడానికి చేతికర్ర సాయం అందించడంతో పాటు.. కూర్చోవడానికి, లేవడానికి వీలుగా మరుగుదొడ్డికి ఇరువైపులా గోడలకు ఇనుప రాడ్లు బిగించాలి.

* సాధ్యమైనంత వరకూ నాలుగు అడుగులు వేసి మరుగుదొడ్డికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. పడుకోబెడితే మరింత క్షీణిస్తారు. త్వరగా నడిపించడం కూడా చికిత్సలో భాగమే. అసలు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు పడక దగ్గరే కాలకృత్యాలను తీర్చడం ఎలాగూ తప్పదు.

* గాలి పీల్చడం, వదలడం వంటి వ్యాయామాన్ని తరచూ చేయించాలి. తద్వారా ఊపిరితిత్తులు మెరుగుపడతాయి.

* మంచాన పడి ఉన్నప్పుడు కోపం కూడా వస్తుంటుంది. తనను సరిగా పట్టించుకోవడం లేదనే భావన పెరుగుతుంది. దీన్ని అర్థం చేసుకొని ఓర్పుతో మెలగాలి.


సాంకేతిక పరిజ్ఞానం ఆసరాగా..
- డాక్టర్‌ సాయిసందీప్‌ బుద్ద, కన్సల్టెంట్‌, జీరియాట్రిక్‌ అండ్‌ న్యూరో ఫిజీషియన్‌, నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌, యూకే

* వృద్ధుల్లో కీళ్లనొప్పులు, నడుము నొప్పులు, కండరాల బలహీనత, ఎముకలు పెళుసుబారడం, ఎముకలు విరిగిపోవడం, మతిమరుపు, మానసిక కుంగుబాటు వంటివి సర్వసాధారణమే. ఎక్కువగా శారీరక కదలికలు, శ్రమ లేకపోవడం వల్ల ఎముకలు, కండరాలు బలహీనమై గాయలవుతాయి. అందుకే వారికి శారీరక కదలికలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే నిమోనియా బారినపడే అవకాశం ఉంటుంది.

* క్రమం తప్పకుండా బీపీ, షుగర్‌ పరీక్షలు వంటివి పరీక్షించాలి. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు చేతికి బిగించే స్మార్ట్‌ వాచ్‌ సాయంతో నాడి కొట్టుకునే వేగాన్ని, బీపీని చూడొచ్చు.

* ఇంట్లో పెద్దవారు పడిపోయినప్పుడు వెంటనే గుర్తించేలా సీసీ కెమెరాలు, తదితర సాంకేతిక పరికరాలను అమర్చాలి. కార్యాలయంలో పనిచేస్తూ కూడా ఇంట్లో పెద్దవారు ఎలా ఉన్నారో పరిశీలించుకునే అవకాశాలున్నాయి.

* అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాలను పెద్దవారి చేతికి బిగించొచ్చు. ఏ రకమైన అవాంఛనీయ స్థితిలోకి చేరినా.. పడిపోయినా.. కదలికల్లేని స్థితిలో ఉన్నా.. అలారం మోగుతుంది. కార్యాలయంలో ఉన్నవారిని కూడా అప్రమత్తం చేస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉన్న పెద్దవారిలో ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తున్నట్లు స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని