‘పాలమూరు’కు నీటి కేటాయింపులపై రెండు రాష్ట్రాల పట్టు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ జారీ చేసిన జీవో 246 చట్ట విరుద్ధమని ఏపీ, నీటి లభ్యత ఉన్నందునే డీపీఆర్‌ ఆమోదానికి జీవో జారీ చేశామని తెలంగాణ వాదనలు వినిపించాయి.

Updated : 25 Mar 2023 05:42 IST

డీపీఆర్‌ ఆమోదం కోసమే నీటి లభ్యతపై జీవో ఇచ్చామన్న తెలంగాణ
ఆ జీవోపై ట్రైబ్యునల్‌లో ఏపీ అభ్యంతరాలు
ఇప్పుడు నీటి పంపిణీ అధికారం తమకు లేదన్న ట్రైబ్యునల్‌

ఈనాడు, హైదరాబాద్‌: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు చేస్తూ తెలంగాణ జారీ చేసిన జీవో 246 చట్ట విరుద్ధమని ఏపీ, నీటి లభ్యత ఉన్నందునే డీపీఆర్‌ ఆమోదానికి జీవో జారీ చేశామని తెలంగాణ వాదనలు వినిపించాయి. ఏపీ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో దిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌-2 ముందు శుక్రవారం రెండు రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ట్రైబ్యునల్‌ ఇప్పుడు నదీ జలాల కేటాయింపులు చేయదని, కేటాయింపులు పూర్తికాని పక్షంలోనే ప్రాజెక్టుల వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేస్తుందని స్పష్టం చేసింది. మైనర్‌ ఇరిగేషన్‌లో వినియోగం కింద 45 టీఎంసీలు, గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తున్న నేపథ్యంలో ఎగువన వినియోగించుకునే వెసులుబాటున్న 45 టీఎంసీలను నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పాలమూరు ఎత్తిపోతలకు కేటాయింపులు చేసిందని ఏపీ పేర్కొంది. ట్రైబ్యునల్‌ మధ్యంతర పిటిషన్లను పరిష్కరించదని, అపెక్స్‌ కౌన్సిల్‌ తగిన వేదిక అంటూ గతంలో తెలంగాణ సూచించిన విషయాన్ని ఏపీ ప్రస్తావించింది. అపెక్స్‌ కౌన్సిల్‌కు న్యాయాన్ని నిర్ధారించే అధికారాలు లేవని, మధ్యవర్తిత్వం మాత్రమే వహిస్తుందని తెలిపింది. దీనికి స్పందించిన ట్రైబ్యునల్‌ అంతర్రాష్ట్ర జల వనరుల వివాదాల చట్టం ప్రకారం విచారణలు ఇప్పటికే ముగిశాయని పేర్కొంది.

మళ్లింపు జలాల పంపిణీయే..

గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు మళ్లించిన 45 టీఎంసీల నీటిని పంచుకునేందుకు సరైన యంత్రాంగం అవసరమని ఏపీ వాదించింది. తెలంగాణ మైనర్‌ ఇరిగేషన్‌ కింద 89.15 టీఎంసీలను కాకుండా 175 టీఎంసీలను వినియోగిస్తోందంటూ మిషన్‌ కాకతీయ ఉత్తర్వులను ఏపీ ఉదహరించింది. తెలంగాణ ఏపీఆర్‌ఏ చట్టం, అపెక్స్‌ కౌన్సిల్‌, కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీలకు పాలమూరు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సమర్పించలేదని పేర్కొంది. దీనికి స్పందించిన తెలంగాణ సీనియర్‌ న్యాయవాది.. ఇప్పటికే డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీకి తెలంగాణ సమర్పించిందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు పొందేందుకే నీటి లభ్యతను చూపాల్సి వచ్చిందా? అంటూ ఈ సందర్భంగా ట్రైబ్యునల్‌ ప్రశ్నించింది. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి పర్యావరణ అనుమతులు పొందాలంటే సీడబ్ల్యూసీ నుంచి నీటి లభ్యత ఉన్నట్లు ఆధారాలు చూపాల్సి ఉన్నందునే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీవో-246 జారీ చేసిందని తెలంగాణ పేర్కొంది. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్తా, జి.ఉమాపతి, తెలంగాణ తరఫున సీఎస్‌ వైద్యనాథన్‌, రామకృష్ణారెడ్డి తదితరులు వాదనలు వినిపించారు. అనంతరం ట్రైబ్యునల్‌ విచారణను వచ్చే నెల 12, 13 తేదీలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు