తెలంగాణ మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్‌ సమన్లు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది.

Updated : 08 Apr 2024 11:01 IST

చెన్నై, న్యూస్‌టుడే: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ విభాగం సమన్లు జారీచేసింది. ఆయన డైరెక్టర్‌గా ఉన్న హైదరాబాద్‌లోని కంపెనీకి వాటిని పంపి విచారణకు హాజరవ్వాలని పేర్కొంది. ఆయన విదేశాల నుంచి అత్యంత ఖరీదైన చేతి గడియారాలను తెప్పించినట్లు ఆరోపించింది. ఈ నెల 4న తమ ఎదుట హాజరవ్వాలని సమన్లు జారీ చేయగా.. తాను డెంగీ జ్వరంతో బాధపడుతున్నందున రాలేకపోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈనెల 27 తర్వాత హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. హాంకాంగ్‌లో ఉంటున్న భారతీయుడు, లగ్జరీ వాచ్‌ల డీలర్‌ ముహమ్మద్‌ ఫహేరుద్దీన్‌ ముబీన్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 5న అలోకం నవీన్‌కుమార్‌ సింగపూర్‌-చెన్నై విమానంలో గడియారాలను తెచ్చాడు. అతడిపై స్మగ్లింగ్‌ కేసు నమోదైంది. ఆ వాచీల విలువ రూ.1.73 కోట్లు. వాటిని హర్షారెడ్డి కోసం తెచ్చినట్లు కస్టమ్స్‌ ఆరోపిస్తోంది. తాను హర్షారెడ్డికి, ముబీన్‌కు మధ్యవర్తిగా ఉన్నట్లు నవీన్‌కుమార్‌ తెలిపాడు. క్రిప్టో కరెన్సీ ద్వారా హర్షారెడ్డి ఆ డబ్బులు బదలాయించినట్లు విచారణలో బయటపడింది. చెన్నైలోని అలందూరు కోర్టు ఏప్రిల్‌ 1న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నవీన్‌కుమార్‌ను అరెస్టు చేయడంతో పాటు హర్షారెడ్డిని విచారించేందుకు కస్టమ్స్‌ అధికారులు సిద్ధమయ్యారు. హర్షారెడ్డి పీటీఐతో మాట్లాడుతూ.. కస్టమ్స్‌ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని