Rishi Sunak: సునాక్‌ ఇంటిపై నల్లటి వస్త్రం

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ ప్రైవేటు గృహం వద్ద పర్యావరణకారులు ఆందోళన చేపట్టారు. ఆయన ఇంటిపై ఓ నల్లటి వస్త్రాన్ని కప్పి నిరసన వ్యక్తం చేశారు.

Updated : 04 Aug 2023 08:03 IST

పర్యావరణ ఆందోళనకారుల చర్య

లండన్‌: బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ ప్రైవేటు గృహం వద్ద పర్యావరణకారులు ఆందోళన చేపట్టారు. ఆయన ఇంటిపై ఓ నల్లటి వస్త్రాన్ని కప్పి నిరసన వ్యక్తం చేశారు. చమురు బావుల తవ్వకాలపై ఆయన ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. ఈ మేరకు గ్రీన్‌పీస్‌ యూకే సంఘం ఆందోళన చిత్రాలను ట్విటర్లో పోస్టు చేసింది. వాటిలో ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌లో గల రిషి సునాక్‌ ఇంటిపైకి కొందరు ఎక్కి నల్లటి వస్త్రాన్ని కప్పేసినట్లుంది. మరో ఇద్దరు ఆందోళనకారులు ‘‘రిషి సునాక్‌- చమురు లాభాలా.. మా భవిష్యత్తా..?’’ అన్న నినాదాలు రాసిన బ్యానర్‌ను పట్టుకొన్నారు. ‘‘మా ప్రధాని పర్యావరణ పరిరక్షణలో ముందుండాల్సిన అవసరం ఉంది.. పర్యావరణ విధ్వంసంలో కాదు’’ అని గ్రీన్‌పీస్‌ యూకే పేర్కొంది. ఈ ఘటనపై ప్రధాని రిషి సునాక్‌ కార్యాలయం స్పందించింది. పోలీసులు అక్కడే ఉన్నారని తెలిపింది. ‘‘దేశ ఇంధన భద్రత, వనరుల సద్వినియోగం కోసం తీసుకొన్న సరైన నిర్ణయంపై ఎటువంటి పశ్చాత్తాపం లేదు. మనం పుతిన్‌ వంటి ఆక్రమణదారులపై ఇంధనం కోసం ఆధారపడలేము’’ అని పేర్కొంది. 2019లో థెరిసా మే ప్రధానిగా ఉన్న సమయంలో బ్రిటన్‌ 2050 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించే విధానాన్ని చేపట్టింది. ఈ విధానానికి భిన్నంగా సునాక్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని