తాత్కాలికంగా రూ.224 కోట్లివ్వండి

గోదావరి వరదల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీగా రూ. 18 కోట్లు, ఇళ్ల నష్టానికి రూ. 39 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్క వేసింది. రహదారుల మరమ్మతులకు రూ. 73 కోట్లు కావాలని తేల్చింది. గత నెలలో

Published : 16 Aug 2022 03:58 IST

శాశ్వత పనులకు రూ. 1,139 కోట్లు  
వరదలపై కేంద్రానికి రాష్ట్రం నివేదిక

ఈనాడు-అమరావతి: గోదావరి వరదల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీగా రూ. 18 కోట్లు, ఇళ్ల నష్టానికి రూ. 39 కోట్లు అవసరమని ప్రభుత్వం లెక్క వేసింది. రహదారుల మరమ్మతులకు రూ. 73 కోట్లు కావాలని తేల్చింది. గత నెలలో ముంచెత్తిన వరదలకు సంబంధించి రూ. 224 కోట్లను తాత్కాలిక సాయంగా అందించాలని కేంద్రాన్ని కోరింది. జాతీయ విపత్తు నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని కేంద్ర బృందానికి నివేదించింది. శాశ్వత పునరుద్ధరణ కింద రహదారుల నిర్మాణానికి రూ. 699 కోట్లు, జలవనరుల శాఖకు రూ. 380 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖకు రూ. 49 కోట్లు, పురపాలక శాఖకు రూ. 10.56 కోట్లు, తాగునీటి సరఫరాకు రూ. 67 లక్షలు కలిపి రూ. 1,139 కోట్లు ఇవ్వాలని కోరింది.

467 గ్రామాలపై ప్రభావం

అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 467 గ్రామాలపై గోదావరి వరదల ప్రభావం పడింది. 389 గ్రామాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 12 రోజుల పాటు పడరాని పాట్లు పడ్డారు. 16 ఏళ్ల తర్వాత గరిష్ఠ వరద ప్రవాహం 25.80 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది.  

పంట నష్టం రూ. 173 కోట్లు..

వరదలతో 30 వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. 22 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు సంబంధించి 4,26,754 టన్నుల ఉత్పత్తి దెబ్బతింది. రైతులకు రూ. 173 కోట్ల పంట నష్టం వాటిల్లింది. ఇందులో 12,500 ఎకరాల మేర అరటి తోటలే ఉన్నాయి. పెట్టుబడి రాయితీగా మొత్తం ఉద్యాన పంటలకు రూ. 14 కోట్లు, 8,000 ఎకరాల వ్యవసాయ పంటలకు రూ. 4.18 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. నీట మునిగి 144 పక్కా, 1,924 కచ్చా ఇళ్లు పూర్తిగా, 433 పక్కా, 859 కచ్చా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 3,206 పక్కా, కచ్చా ఇళ్లు, 11,164 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీరికి రూ. 39 కోట్లను సాయంగా అందించాలని నివేదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని