Macherla: అర్ధరాత్రి కరెంటు తీసి.. మఫ్టీలో వచ్చి.. తలుపు తట్టి..

పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా మైనారిటీ నేత సయ్యద్‌ అన్వర్‌బాషాను బుధవారం అర్ధరాత్రి సివిల్‌ దుస్తుల్లో వచ్చిన పోలీసులు అరెస్టుచేశారు. ఒక గంటలో విచారించి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు తెల్లారినా పంపకపోవడం, ఎక్కడ ఉంచారో తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.

Updated : 30 Jun 2023 08:12 IST

తెదేపా నేత అన్వర్‌బాషాను పట్టుకెళ్లిన పోలీసులు
తీసుకెళ్లింది ఎవరో తెలియక  కుటుంబసభ్యుల మానసిక క్షోభ
ఎట్టకేలకు న్యాయమూర్తి వద్ద  హాజరుపర్చిన పోలీసులు.. 14 రోజుల రిమాండు
బక్రీద్‌ పండగ వేళ అరెస్టుపై ముస్లిం సంఘాల ఆగ్రహం

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా మైనారిటీ నేత సయ్యద్‌ అన్వర్‌బాషాను బుధవారం అర్ధరాత్రి సివిల్‌ దుస్తుల్లో వచ్చిన పోలీసులు అరెస్టుచేశారు. ఒక గంటలో విచారించి పంపిస్తామని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు తెల్లారినా పంపకపోవడం, ఎక్కడ ఉంచారో తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. నియోజకవర్గంలోని అన్ని స్టేషన్లలో ఆరా తీసినా సమాచారం తెలుసుకోలేపోయారు. ముస్లింలకు పర్వదినం బక్రీద్‌ వేళ అరెస్టు చేయడం, ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు మానసిక క్షోభ అనుభవించారు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం బాషాను న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టారు. కారంపూడిలో ఇటీవల జరిగిన గొడవ కేసులో జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండు విధించారు.

క్రియాశీలకంగా ఉన్నారనే..

మాచర్ల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డికి అన్వర్‌బాషా ప్రధాన అనుచరుడు. తెదేపా ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ బస్సుయాత్రను మాచర్లలో విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆ రోజు డీజే పెట్టి పాటలతో పట్టణంలో హడావుడి చేయడాన్ని వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలో తెదేపాలో క్రియాశీలకంగా ఉండటంతోపాటు పార్టీకి గట్టిగా పని చేస్తుండటంతో వేధించడానికి అక్రమ కేసులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. కారంపూడిలో ఈ నెల 20వ తేదీ ఉదయం వైకాపా, తెదేపా నేతల మధ్య గొడవ జరిగింది. దీంతో ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయి. వైకాపా వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు తెదేపా నేతలతోపాటు ఇతరుల పేర్లతో కేసు నమోదు చేశారు. ఇందులో ఇప్పుడు సయ్యద్‌ అన్వర్‌ బాషాను చేర్చారు. ఈ కేసులోనే బుధవారం అర్ధరాత్రి కారంపూడి పోలీసులు అరెస్టు చేశారు. కారంపూడి ఘటనతో అన్వర్‌కు సంబంధం లేకపోయినా కావాలనే హత్యాయత్నం కేసులో ఇరికించారన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ సమయంలో తీసుకెళ్లొద్దని వేడుకున్నా..

మాచర్ల జెండా చెట్టు ప్రాంతంలోని బుచ్చమ్మ బజారులో నివాసం ఉంటున్న సయ్యద్‌ అన్వర్‌బాషా ఇంటికి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు వచ్చారు. ఆ సమయంలో విద్యుత్తు సరఫరా లేదు. ఇంటి తలుపు కొట్టడంతో తలుపు తీయగా.. అన్వర్‌ కావాలని అడిగినట్లు తల్లి మీరాబీ చెప్పారు. తాము పోలీసులమని... అన్వర్‌ను తమతో పంపితే చిన్న విచారణ ఉందని, గంటలో పంపిస్తామని చెప్పారు. తమ అబ్బాయి తగాదాలకు వెళ్లే వ్యక్తి కాదని, ఏదైనా ఉంటే పగటివేళ రావాలని, తాము ఎక్కడికీ పారిపోబోమని పోలీసులతో తల్లి మీరాబీ చెప్పారు. ఇలా అర్ధరాత్రి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇవేవీ పట్టించుకోని పోలీసులు అన్వర్‌ను తీసుకుని వెళ్లిపోయారు. అందరూ సివిల్‌ దుస్తుల్లో ఉండటం, గుర్తు పట్టడానికి వీలులేకపోవడంతో ఎవరు తీసుకెళ్లారోనని కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత పోలీసులమంటూ వచ్చి అన్వర్‌ను తీసుకెళ్లిన వారు పోలీసులా.. ఇతరులా అన్న అనుమానంతో అన్వర్‌ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు.

అర్ధరాత్రి.. ఏమిటీ దారుణం

‘‘అర్ధరాత్రి వేళ వచ్చి హడావుడి చేసి మహిళలు, పిల్లలను భయాందోళనలకు గురిచేయడం ఎంతవరకు సమంజసం? వచ్చినవారంతా గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. పోలీసులు పగటివేళ వచ్చి తీసుకెళ్లవచ్చు. రాత్రి అయినా తాము ఫలానా పోలీసుస్టేషన్‌ నుంచి వచ్చామని, ఫలానా కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పవచ్చు. అవేవీ చెప్పకుండా ఎలా తీసుకెళ్లారు? పోలీసుల పేరుతో ఎవరైనా తీసుకెళ్తే మేం ఎవరికి చెప్పుకోవాలి? ఆడవారు అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్లి వెతకాలి? సాయంత్రం వరకూ ఎవరు.. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. కనిపించిన ప్రతి ఒక్కరినీ.. అన్వర్‌ను చూపించాలని అడుగుతూనే ఉన్నాం’’ అని తల్లి సయ్యద్‌ మీరాబీ, భార్య ఆయేషా ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఉంటున్న అన్వర్‌ను కారంపూడి ఘటనలో.. అదీ కావాలని బక్రీద్‌ పండగ వేళ అరెస్టు చేయడంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎప్పుడో వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో ఇప్పటికిప్పుడు అర్ధరాత్రి అరెస్టు చేయడమేంటని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా భయపెట్టాలనే బక్రీద్‌ రోజు అరెస్టు చేసి కక్ష తీర్చుకున్నారని వారు ఆరోపించారు.

న్యాయమూర్తి ఇంటి దగ్గర హాజరు..

కారంపూడిలో ఇటీవల జరిగిన తెదేపా, వైకాపా ఘర్షణ కేసులో నిందితునిగా అన్వర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయనను న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించారు.


సంబంధం లేని కేసులో ఇరికించారు: అన్వర్‌బాషా

తనకు సంబంధం లేని కేసులో ఇరికించి తనను ఇబ్బందులకు గురిచేశారని సయ్యద్‌ అన్వర్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన తర్వాత ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. తన కుమార్తెను ఎత్తుకొని భోరున విలపించారు. ఇంతకంటే తనను ఇంకేం చేయగలరని ప్రశ్నించారు. తనను ఓ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లిన కారంపూడి ఎస్సై.. స్టేషన్‌కు వెళ్లాక కొట్టారన్నారు. వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో తనను 13వ ముద్దాయిగా పెట్టినట్లు పోలీసులు చెప్పారన్నారు. ఆ గొడవకు, తనకు సంబంధం లేదన్నారు. తనలాంటి అమాయకుల ఉసురు ఎంతకాలం తీసుకుంటారని ప్రశ్నించారు. కేసులు పెట్టడం మినహా ఇంకేం చేస్తారు.. పోతే పోయేది ప్రాణమేగా అంటూ అన్వర్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు.


బక్రీద్‌ వేళ.. ముస్లిం సోదరుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారా?

తండ్రిని తీసుకెళ్తుంటే.. తల్లడిల్లే  బిడ్డకు ఏమని సమాధానమిస్తారు?
మాచర్లలో అన్వర్‌బాషా  అరెస్టుపై చంద్రబాబు ఆగ్రహం

ఈనాడు, అమరావతి: ‘తెల్లారితే బక్రీద్‌ అనగా ముస్లిం సోదరుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? రాక్షస రాజ్యమా? మీరు మనుషులేనా? మానవత్వం ఉందా?’ అని అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘మాచర్లలో తెదేపా కార్యకర్త సయ్యద్‌ అన్వర్‌ బాషా అరెస్టు.. జగన్‌రెడ్డి ఫాసిస్టు పాలనకు నిదర్శనం. తండ్రిని పోలీసులు తీసుకెళ్తుంటే.. తల్లడిల్లుతున్న బిడ్డకు మీరు ఏ సమాధానం చెబుతారు? ఈ వికృత రాజకీయ క్రీడకు, అమానవీయ పోకడలకు.. మీరు, మీ పార్టీ నేతలు ఇంతకంటే ఎక్కువ మూల్యం చెల్లిస్తారు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఎప్పుడో ఎక్కడో జరిగిన వివాదంతో ముడిపెట్టి.. ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టి.. జైలుకు పంపిస్తారా? బక్రీద్‌ రోజున ఒక ముస్లిం కుటుంబాన్ని క్షోభకు గురిచేసిన పాపం పోలీసుల్ని, కుట్ర చేసిన వైకాపా నేతల్ని వెంటాడుతుంది. ముస్లిం సమాజం మీ చర్యను గమనిస్తోంది. గట్టిగా బుద్ధి చెబుతుంది’ అని హెచ్చరించారు. అన్వర్‌బాషాను రిమాండుకు పంపేముందు ఆయన బిడ్డ, కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని