జగన్‌ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్‌ చేయాలని) హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది.

Updated : 01 May 2024 06:52 IST

న్యాయమూర్తి బదిలీతో డిశ్ఛార్జి పిటిషన్‌లపై తిరిగి విచారణ
నిర్ణయం వెలువరించిన సీబీఐ కోర్టు న్యాయమూర్తి
అనారోగ్యం కారణంగా గడువులోగా విచారణ పూర్తిచేయలేకపోయినట్లు తెలంగాణ హైకోర్టుకు లేఖ
దశాబ్దకాలంగా తేలని వ్యాజ్యాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్‌ చేయాలని) హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు నిర్దేశించిన ప్రకారం మంగళవారం(ఏప్రిల్‌30)లోగా డిశ్ఛార్జి పిటిషన్‌లపై విచారణ పూర్తి చేయాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా విచారణ పూర్తి చేయలేకపోయినట్లు సీబీఐ కోర్టు న్యాయమూర్తి హైకోర్టుకు మంగళవారం లేఖ రాశారు. అనంతరం డిశ్ఛార్జి పిటిషన్‌లపై తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న న్యాయమూర్తి తిరిగి విచారణ ప్రారంభించనున్నారు. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ 11, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) 9 అభియోగ పత్రాలను దాఖలు చేశాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్‌, శామ్యూల్‌, బి.పి.ఆచార్య, జి.వెంకట్రామిరెడ్డిలతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు దాదాపు 130 డిశ్ఛార్జి పిటిషన్‌లు దాఖలు చేశారు.

దశాబ్దంగా కొనసాగుతున్న విచారణ

2013 నుంచి దాఖలైన జగన్‌ అక్రమాస్తుల కేసులోని డిశ్ఛార్జి పిటిషన్‌లపై ఇప్పటివరకు ఏడుగురు న్యాయమూర్తులు విచారణ చేపట్టినా అవి పూర్తికాకముందే బదిలీ అయ్యారు. 8వ న్యాయమూర్తి ఈ పిటిషన్‌లపై తిరిగి మే 15 నుంచి విచారణ చేపట్టనున్నారు. దాదాపు 130 పిటిషన్‌లపై విచారణ పూర్తికావడానికి సుదీర్ఘ సమయం పడుతుండటం, ఈలోగా న్యాయమూర్తులు బదిలీ కావడంతో విచారణ మళ్లీ మొదటికి వస్తోంది. ఈ నేపథ్యంలో అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై ఈ అంశాన్ని సుమోటో పిటిషన్‌గా స్వీకరించిన విషయం తెలిసిందే. సుమోటో పిటిషన్‌పై విచారించిన హైకోర్టు రెండు నెలల్లో విచారణ పూర్తి చేయాలంటూ సీబీఐ కోర్టుకు గత ఏడాది డిసెంబరు 15న ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన గడువు ఫిబ్రవరి 15తో ముగియనుండగా విచారణ పూర్తికాలేదని, సుమారు 13 వేల పేజీల పత్రాలను పరిశీలించాల్సి ఉన్నందున మరికొంత గడువు కావాలంటూ జనవరి 30న హైకోర్టుకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. దీంతో హైకోర్టు ఏప్రిల్‌ 30 వరకు గడువు పొడిగించింది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 19న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 47 మంది జిల్లా జడ్జీల బదిలీల్లో భాగంగా.. సీబీఐ కోర్టు న్యాయమూర్తి రమేశ్‌బాబు హనుమకొండ జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారందరూ మే 1వ తేదీలోగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశాలివ్వగా, సీబీఐ కోర్టు న్యాయమూర్తి రమేశ్‌బాబుకు మినహాయింపునిస్తూ మే 1న రిలీవ్‌ కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం రిలీవ్‌కానుండటంతో మంగళవారం డిశ్ఛార్జి పిటిషన్‌లపై నిర్ణయం వెలువరిస్తారని భావించి పలువురు నిందితులు, న్యాయవాదులు హాజరయ్యారు. అయితే అనారోగ్యం కారణంగా ఇటీవల ఆసుపత్రిలో చేరడం వంటి కారణాల వల్ల తీర్పులను సిద్ధం చేయలేకపోయినట్లు న్యాయమూర్తి హైకోర్టుకు లేఖ రాశారు. అనంతరం డిశ్ఛార్జి పిటిషన్‌లపై తిరిగి విచారణ చేపట్టాలంటూ ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని